హైదరబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ) : నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్ -2, గ్రూప్ -3 పరీక్షలపై సస్పెన్స్ కొనసాగుతున్నది. దీనిపై టీఎస్పీఎస్సీ ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత ఇవ్వడంలేదు. తాజా అంచనా ప్రకారం.. ఇప్పట్లో ఈ రెండు నియామక పరీక్షలను నిర్వహించే అవకాశాలు కనిపించడంలేదు. టీఎస్పీఎస్సీ వీటిపై దృష్టిపెట్టకపోవడం, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఈ పరీక్షలకు ముహుర్తం కుదరడం లేదు. దీంతో గ్రూప్ -2కు మరింత సమయం పట్టవచ్చు. ప్రస్తుత నోటిఫికేషన్కు.. మరికొన్ని కొత్త పోస్టులను జతచేయాలని కమిషన్ భావిస్తున్నది. ఇదే నిజమైతే పాత నోటిఫికేషన్కు అనుబంధ నోటిఫికేషన్ జారీచేస్తారు. ఇందుకు ప్రభుత్వశాఖల నుంచి ఖాళీల వివరాలు రావాలి. ఖాళీలపై ఆర్థికశాఖ ఆమోదమివ్వాలి. మొత్తం మీద గ్రూ ప్ -2 పోస్టుల భర్తీకి మరికొంత సమయం పట్టే అవకాశాలున్నాయి. ప్రభుత్వ వర్గాల కథ నం ప్రకారం కొన్ని అదనపు పోస్టులతో అనుబంధ నోటిఫికేషన్ను విడుదల చేయొచ్చు.
ఇక గ్రూప్ -3 పరీక్ష పరిస్థితి విచిత్రంగా ఉంది. ఇంత వరకు ఈ పరీక్షను ఎప్పుడు నిర్వహిస్తారన్న అంశంపై కమిషన్ స్పష్టతనివ్వడంలేదు. 2022 డిసెంబర్ 30న 1,363 పోస్టుల భర్తీకి గ్రూప్ -3న నోటిఫికేషన్ను జారీచేశారు. ఆ తర్వాత మహాత్మాజ్యోతిబా ఫూలే బీసీ గురుకులాల్లో 12 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను చేర్చి అదనపు నోటిఫికేషన్ ఇచ్చారు. దీంతో పోస్టుల సంఖ్య 1,375కు చేరింది.
వరుస నోటిఫికేషన్లు, పరీక్షల ఒత్తిడి నేపథ్యంలో టీఎస్పీఎస్సీకి అదనంగా సిబ్బందిని ఇవ్వాలని టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్రెడ్డి ఇటీవలే ప్రభుత్వాన్ని కోరారు. తాజా అవసరాల దృష్ట్యా 150 మంది సిబ్బందిని కేటాయించాలని ప్రభుత్వానికి నివేదించారు. దీంతో 50 మందిని తక్షణమే డిప్యూటేషన్ మీద, మరో 100 మంది ఉద్యోగులను రిక్రూట్చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎన్నికలకు ముందు టీఎస్పీఎస్సీలో సిబ్బందిలేరంటూ విమర్శించిన ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి టీఎస్పీఎస్సీ ప్రతిపాదనలను పక్కనపెట్టేశారు. దీంతో ఉన్న సిబ్బందితో నెట్టుకురాలేక కమిషన్ నానా అవస్థలు పడుతున్నది.