Telangana | తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి ఎవరనేదానిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతున్నది. ఇవాళ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో రాజ్భవన్లో సైతం ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఏఐసీసీ పరిశీలకుల నేతృత్వంలో ఎల్లా హోటల్లో సీఎల్పీ సమావేశం జరిగింది. సీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి ఎంపిక బాధ్యతను ఎమ్మెల్యేలు అధిష్ఠానానికి అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానం చేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఏకవాక్య తీర్మానం ప్రవేశపెట్టగా.. భట్టి విక్రమార్క, సీతక్కతో పాటు పలువురు ఎమ్మెల్యేలు బలపరిచారు.
సాయంత్రం వరకు ముఖ్యమంత్రి పేరును అధిష్ఠానం ప్రకటిస్తారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో రాజ్భవన్లో సీఎం ప్రమాణానికి సైతం ఏర్పాట్లు జరిగాయి. అయితే, సీఎల్పీలో సీఎం ఎవరనేదానిపై కొలిక్కి రాలేదు. గంటల పాటు సీనియర్ నేతలతో డీకే శివకుమార్తో పాటు ఏఐసీసీ పరిశీలకులు చర్చలు జరిపారు. ఇప్పటి వరకు సీఎం ఎంపిక వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదని సమాచారం. సమావేశం జరిగిన గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్ నుంచి సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు, దామోదర రాజనర్సింహ వెళ్లిపోయారు.
నలుగురు నేతలు సమావేశం నుంచి బయటకు వెళ్లిపోవడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత డీకే శివకుమార్తో పాటు నలుగురు ఏఐసీసీ పరిశీలకులను కాంగ్రెస్ అధిష్ఠానం ఢిల్లీకి పిలిచింది. దీంతో ఐదుగురు నేతలు ఢిల్లీకి పయణమయ్యారు. చర్చలకు సంబంధించిన సారాంశంపై పరిశీలకులు అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లనున్నారు. పరిశీలకులు, డీకే శివకుమార్ కలిసి కాంగ్రెస్ ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేతో మంగళవారం ఉదయం సమావేశం కానున్నట్లు తెలిసింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గ కూర్పుపై సమాలోచనలు చేసి.. తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.