సూర్యాపేట : తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశమంతటా సంచలనాలు సృష్టిస్తుండగా అదే కోవలో మరో అరుదైన గౌరవం సూర్యాపేట జిల్లాకు దక్కింది. బుధవారం కాళేశ్వరం జలానికి లక్ష జనహారతి నిర్వహించి వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది.
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్ధంగా ప్రభుత్వం వరుసగా 21 రోజుల పాటు ప్రభుత్వ పథకాలతో వేడుకలను నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా బుధవారం సాగునీటి దినోత్సవాన్ని రాష్ట్రమంతటా పండుగ వాతావరణంలో నిర్వహించింది . చెరువులు, కాలువలు, ప్రాజెక్ట్ల వద్ద రైతులతో స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆధ్వర్యంలో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ ఉద్దేశాన్ని వివరించింది.
సూర్యాపేట జిల్లాలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి కాలువల వెంట రైతులు, స్థానిక గ్రామస్థుల ఆధ్వర్యంలో సాగు నీటి దినోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా లక్ష మందితో కాలువల వెంట రైతులు వరుసలో నిలబడి పూజాది కార్యక్రమాలు జరపాలని పిలుపునిచ్చారు . అయితే లక్షా 16,022 మంది రైతులు, మహిళలు తరలి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో సూర్యాపేట జిల్లా ఎక్కింది.
జిల్లాలో ప్రభుత్వం లక్ష జనహారతి కార్యక్రమాన్ని ప్రకటించగానే వండర్ వరల్డ్ ఆఫ్ బుక్ సంస్థ ప్రతినిధులు , ఐడబ్ల్యూఎస్ఆర్ ఇండియా చీఫ్ డాక్టర్ బి.నరేందర్ గౌడ్, తెలంగాణ కో-ఆర్డినేటర్ ఏ గంగాధర్ మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం మధ్యాహ్నం 12 గంటల వరకు 7 మండలాల్లో పర్యటించారు
వారు కార్యక్రమ సరళిని పరిశీలించి అవార్డును ప్రకటించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ గతంలో ఇలాంటి కార్యక్రమాలు ఎవరూ చేయలేదని,లక్షలాది మంది రైతులు పంట కాలువల వెంట నిలబడి పూజా కార్యక్రమాలను నిర్వహించడం ఇదే ప్రథమని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. సమస్యలు లేకుండా సాగునీటిని అందిస్తున్న ప్రభుత్వానికి రైతులు కృతజ్ఞతలు తెలియజేస్తూ జలహారతిలో పాల్గొనడాన్ని సంస్థ ప్రతినిధులు మంత్రి జగదీశ్ రెడ్డిని అభినందిస్తూ మెడల్, ప్రశంసా పత్రాలను అందజేసి శాలువాతో సన్మానించారు.