60 ఏండ్ల మీ పాలనలో దళితులు కనబడలేదా?
మాకు అండగా ఉంటున్నది తెలంగాణ ప్రభుత్వమే
ఎవరెన్ని చెప్పినా వినేది లేదు
సీఎం కేసీఆర్ సారే మా దేవుడు
కాంగ్రెస్ నేత వీహెచ్ పర్యటనపై తిరుమలగిరి దళితుల ఆగ్రహం
సూర్యాపేట, మే 24(నమస్తే తెలంగాణ): ‘60 ఏండ్లు పరిపాలన చేసినరు కాంగ్రెస్సోళ్లు.. ఇన్నాళ్లు పేదోళ్లు కనపడలేదా? కేసీఆర్ సారు దళితులకు పది లక్షలు ఇస్తుంటే ఓర్వలేక ఇయ్యాల వచ్చి మాయ మాటలు చెప్పాలనుకుంటున్నరు. చిన్న పోరడి కాన్నుండి ముసలోళ్ల దాకా కేసీఆర్ సారుకు మొక్కుతున్నరు. ఎవరేం చెప్పినా మేం వినం. కేసీఆర్ సారే మాకు దేవుడు’ అంటూ తిరుమలగిరికి చెందిన దళితులు కుండబద్దలుకొట్టారు. మంగళవారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో పర్యటించిన కాంగ్రెస్ నేత వీ హనుమంతరావు బృందానికి దళితులు ధమ్కీ ఇచ్చారు. నేరుగా నిలదీయడంతో పాటు తీవ్రంగా మండిపడ్డారు. పాదయాత్ర పేరుతో తమ ఇండ్లల్లోకి దెయ్యాల్లా వచ్చారంటూ భగ్గుమన్నారు. పట్టపగలు ఇండ్లలోకి వచ్చి.. వారే కుర్చీలు వేసుకుని కూర్చొని, ఫొటోలకు ఫోజులిచ్చారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
‘మా నోట్లో మట్టి కొట్టేందుకే మా ఇండ్లలోకి వచ్చారా?’ అంటూ దళిత మహిళలు నిలదీశారు. తమ ఇంట్లోకి వచ్చినాయన ఎవరో తెలియదని, మూలకు ఉన్న కుర్చీ తెచ్చుకుని వేసుకుని కూర్చున్నడని స్పష్టంచేశారు. గోదావరి నీళ్లు రావడంతో చేతినిండా పని దొరికి పచ్చగా బతుకుతున్నామని చెప్పారు. నడి ఎండకాలంలో కూడా చెరువులన్నీ కళకళలాడుతున్నది కాంగ్రెసోళ్లకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ దళితులకు ఇస్తున్న దళితబంధును ఆపించేందుకు వచ్చారా? అంటూ మండిపడ్డారు. మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే కిషోర్కుమార్ వల్లే తిరుమలగిరి మండలంలోని దళితులందరికీ దళితబంధు కింద రూ.10 లక్షలు అందుతున్నాయని చెప్పుకొచ్చారు. ఏ కాంగ్రెస్ నాయకుడూ ఇన్నేండ్లలో తమ గోడు పట్టించుకోలేదని వాపోయారు. ఎవరెన్ని మాటలు చెప్పినా, తమ బాగు ఆలోచించే కేసీఆర్ సారు వెంటే తామంతా ఉంటామని స్పష్టంచేశారు.