Illegal Affair | సూర్యాపేట సిటీ, అక్టోబర్ 27: ఇద్దరి వివాహేతర సంబంధం మరో ఇద్దరి ప్రాణాలను బలిగొన్నది.. రెండు కుటుంబాల్లో చీకట్లు నింపింది. వేరే మహిళతో సంబంధం పెట్టుకొని భార్యను చంపగా, ఆ మహిళ భర్తను చంపించింది. ఈ దారుణ ఘటనలు సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకున్నాయి. వివరాల్లోకెళితే.. సూర్యాపేటలోని కుడకుడ భాగ్యనగర్ కాలనీకి చెందిన భూక్యా వెంకన్న, మోతె మండలం సిరికొండకు చెందిన అక్కనపల్లి శ్రీశైలం, నామవరానికి చెందిన సారగండ్ల మధు స్నేహితులు. కాగా, భూక్యా వెంక న్న షేక్ నస్రీన్తో వివాహేతర సంబంధం పెట్టుకోగా, ఇరువురి ఇండ్లల్లో ఈ విషయం తెలిసింది. దీంతో వెంకన్న తన భార్యను, నస్రీన్ తన భర్తను అడ్డుతొలగించుకొని కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు.
గత జూలై 8న వెంకన్న, అతని భార్య రమాదేవి కలిసి వారి స్వగ్రామం బళ్లుతండా నుంచి సూర్యాపేటకు బయల్దేరారు. మార్గమధ్యంలో భీమ్లాతండా-బండమీది చందుపట్ల గ్రామాల మధ్య బైక్ను ఆపి పథకం ప్రకారం భార్య తలను కరెంట్ స్తంభానికి బాది, కర్రతో కొట్టి చంపా డు. అనంతరం ప్రమాదం జరిగినట్టు చిత్రీకరించాడు. రెండ్రోజుల పాటు ప్రైవేటు దవాఖానలో కోమాలో ఉన్నట్టు నటించాడు. దీనిపై చివ్వెంల పోలీస్స్టేషన్లో రోడ్డు ప్రమాదం కేసు నమోదైంది. కొంతకాలానికి నస్రీన్ ఇంట్లోనూ గొడవలు ఎక్కువ కావడంతో తన భర్త రఫీని చంపాలని నిర్ణయించుకున్నది.
అక్టోబర్ 9న రాత్రి సమయంలో నస్రీన్ తన భర్త వెళ్లాక వెంకన్నకు ఫోన్ చేసి చెప్పింది. భూక్యా వెంకన్న, అక్కనపల్లి శ్రీశైలం, సారగండ్ల మధు.. నస్రీన్ ఇంటికి వచ్చి తలుపు చాటున దాక్కొన్నారు. రఫీ ఇంట్లోకి రాగానే ముగ్గురూ కలిసి గొంతు నులిమి చంపేశారు. అనంతరం చీరెను రఫీ గొంతుకు కట్టి ఫ్యాన్కు ఉరేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. అయితే, రఫీ సోదరుడి ఫిర్యాదుతో భౌతికకాయానికి పోస్టుమార్టం చేయగా, హత్య చేసినట్టు తేలిం ది. నస్రీన్, వెంకన్నను అదుపులోకి తీసుకొని విచారించగా, రెండు హత్యల విషయాలు బయటపడ్డాయి.
నలుగురు నిందితులను రిమాండ్కు తరలించి రెండు బైక్లు, నాలుగు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. కేసును చేధించిన సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ జీ రాజశేఖర్, ఎస్సైలు ఎస్కే యాకుబ్, రవీందర్, మహేంద్రనాథ్, ఇతర సిబ్బందిని అభినందించి రివార్డు ప్రకటించారు. మీడియా సమావేశంలో అదనపు ఎస్పీ ఎం నాగేశ్వర్రావు, డీఎస్పీ పీ నాగభూషణం పాల్గొన్నారు.