Suryapet | హైదరాబాద్లోని రామంతపూర్ ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ సైదులు మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గతంలో రామంతపూర్ ఎస్బీఐ బ్రాంచ్లో మేనేజర్గా పనిచేసిన సైదులు.. నకిలీ పత్రాలు సృష్టించి ఖాతాదారులకు తెలియకుండా 2.80 కోట్లను కాజేశాడు. ఈ కేసు విచారణ జరుపుతున్న పోలీసులకు.. మరో షాకింగ్ విషయం తెలిసింది. సూర్యాపేట ఎస్బీఐ బ్రాంచ్లో పనిచేసినప్పుడు కూడా ఇదే తరహా మోసానికి పాల్పడి సుమారు రూ.10 కోట్లు కొట్టేసినట్లు బయటపడింది. ఈ విషయం తెలియడంతో బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
అసలేం జరిగిందంటే..
గతంలో షేక్ సైదులు హైదరాబాద్లోని రామంతపూర్ ఎస్బీఐ బ్రాంచ్లో మేనేజర్గా పనిచేశాడు. ఆ సమయంలో గంగ మల్లయ్య అనే మరో బ్యాంక్ ఉద్యోగి సహాయంతో ఖాతాదారులకు తెలియకుండా వాళ్ల డాక్యుమెంట్లు తీసుకుని లోన్లు అప్లై చేశాడు. 19 మంది పేరిట నకిలీ పత్రాలు సృష్టించి దాదాపు రూ.2.80 కోట్లను కాజేశాడు. అయితే రామంతపూర్ బ్రాంచ్ నుంచి సైదులు ట్రాన్స్ఫర్ అయ్యి కొత్త మేనేజర్ రావడంతో వీళ్లు చేసిన మోసం బయటపడింది. దీంతో సైదులుపై కొత్త మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలియడంతో భార్య, కొడుకుతో కలిసి మేనేజర్ సైదులు పరారయ్యాడు. వీరికోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. గతంలో కూడా ఇలాంటి మోసాలు చేశారా? అనే కోణంలోనూ విచారణ జరిపారు. ఈ క్రమంలోనే సూర్యాపేటలోనూ ఇదే తరహా మోసం చేసి రూ. 10 కోట్లు కొట్టేసినట్లు తెలిసింది.