Jagadish Reddy | తుంగతుర్తి : కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను ప్రజలు గమనిస్తున్నారని, కృష్ణా జలాల పంపిణీని కేఆర్ఎంబీకి అప్పగించటం కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనమని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం మండల కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అధ్యక్షతన తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో జగదీశ్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.
కృష్ణా జలాలపై కేంద్రం పెత్తనంతో ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి, పాలమూరు జిల్లాలు సాగు, తాగునీరు కోసం కేంద్రం అనుమతి కోసం ఎదురు చూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల కృష్ణా జలాల ట్రిబ్యునల్ వివాదం ప్రధాని మోదీ తీర్చడానికి 9 ఏళ్లకు పైగా పట్టిందన్నారు. నాడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి కృష్ణా జలాల విషయంలో ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలు తీర్చుకుంటాయని, కేంద్రం తల దూర్చవద్దని కరాఖండిగా మాట్లాడి పోరాడారని గుర్తు చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా కరువుతో కొట్టుమిట్టాడుతుంటే ఒక్క తడి నీరు కోసం కేసీఆర్ కోదాడ నుండి నాగార్జునసాగర్ వరకు పాదయాత్ర చేశారని, కేసీఆర్ పోరాటానికి తలొగ్గిన ప్రభుత్వం ఒక పంట నీరు విడుదల చేసిందని గుర్తు చేశారు. గత పది ఏళ్లలో సాగునీరు తాగునీరుతో పాటు నాణ్యమైన విద్యుత్ అందించామని తెలంగాణ రాష్ట్రానికి మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కష్టాలు తెస్తుందన్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాలను నిర్వహిస్తున్నామన్నారు.
అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ పనితీరు బయటపడిందని విమర్శించారు. సాగునీటి విషయమై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించకపోవడం జిల్లా ప్రజలకు అన్యాయం చేసినట్లేనన్నారు. రైతుబంధు పడటం లేదని అడిగిన వారిని చెప్పుతో కొడతానని మంత్రి కోమటిరెడ్డి అనడం అహంకారానికి నిదర్శనం అన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కార్యకర్తలు, నాయకులు అంతా కష్టపడితే భువనగిరి పార్లమెంటు సీటు బీఆర్ఎస్దే అని అన్నారు. అధికారంలోకి రాగానే మాఫీ చేస్తామన్న రెండు లక్షల రుణమా, పెంచుతామన్న పింఛన్లు హామీ ఏమైందని జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు.