TS Minister Jagadish Reddy | స్థానిక యువతకు ఐటీ హబ్ వరం లాంటిదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. 200 మందితో ప్రారంభమైన ఐటీ హబ్ను ఐదు వేల మందికి విస్తరించడమే తమ లక్ష్యం అని అన్నారు. మున్ముందు యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా సూర్యాపేటలో పారిశ్రామిక హబ్ ఏర్పాటు చేస్తామన్నారు. వచ్చే పారిశ్రామిక హబ్తో 10 వేల మంది స్థానిక యువతకు ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు.
సూర్యాపేటలో ఐటీ హబ్ సేవలను శనివారం మంత్రి గుంట్లకండ్ల జగదీశ్ రెడ్డి ప్రారంభించారు. సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ ఆధ్వర్యంలో కొత్తగా ఎంపికైన 50 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేశారు. సూర్యాపేట ఐటీ హబ్తో ఇంజనీరింగ్ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. టాస్క్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న నైపుణ్య తరగతులు నిరుద్యోగ యువతకు వరం లాంటివని అన్నారు. 45 రోజులు నిర్వహించే శిక్షణ తరగతుల్లో ఒక్కో బ్యాచ్లో 500 మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.
శనివారం నుంచి స్థానిక యువతకు శిక్షణ ప్రారంభమవుతుందని మంత్రి గుంట్లకండ్ల జగదీశ్ రెడ్డి చెప్పారు. ప్రతివారు కూడా ఉద్యోగ ఉపాధి పొందేలా ఉద్యోగానికి అవసరమైన శిక్షలను అందించాలని టాస్క్ టీంకు సూచించారు. హైదరాబాద్కు ధీటుగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోనూ ఐటీ టవర్ ప్రారంభిస్తామని తెలిపారు. జిల్లాలో ఇండస్ట్రియల్ పార్క్ ద్వారా పదివేల మందికి పైగా ఉపాధి అవకాశాలు త్వరలో లభిస్తాయని వెల్లడించారు. ఒకప్పుడు ఉద్యోగం, ఉపాధి కోసం హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు, విదేశాలకు నిరుద్యోగ యువత వెళ్లేవారన్నారు.
తెలంగాణ వచ్చాకే సూర్యాపేటలోనే అందరికీ అవసరమైన వసతులు కల్పించడంతో స్థానిక యువతకు అవకాశాలు వచ్చాయని జగదీశ్ రెడ్డి తెలిపారు. ఉద్యోగం సాధించాలని తపన పట్టుదల అంకితభావంతో శ్రమించాలని ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని ఉద్యోగులకు ఆయన సూచించారు. ఐటీ హబ్ లో అన్ని రకాల శిక్షణ ఇచ్చి ఉపాధి లభించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
ఈ సమావేశంలో నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, టాస్క్ సీఈఓ శ్రీకాంత్ సిన్హా, జిల్లా అదనపు కలెక్టర్ సిహెచ్ ప్రియాంక, ఆర్డీవో వీర బ్రహ్మచారి, తహశీల్దార్ శ్యామ్, మున్సిపల్ కమిషనర్ రామానుజుల రెడ్డి, జిల్లా ఉపాధి కల్పనా అధికారి మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.