హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణలో ముంపేమీ ఉండదని నిన్నటివరకు బుకాయించిన ఏపీ.. ఆ ప్రాజెక్టు ముంపు ప్రభావాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆధారాలతో సహా బహిర్గతం చేయడంతో ఎట్టకేలకు జాయింట్ సర్వేకు అంగీకరించింది. అయినా ఇప్పుడు మళ్లీ కొత్త మెలికలు పెడుతున్నది. కేవలం 150 అడుగల ఎఫ్ఆర్ఎల్ నిల్వ వలన జరిగే ముంపు వరకే సర్వే చేస్తామని కిరికిరి పెడుతున్నది. సీడబ్ల్యూసీ సూచించిన మేరకు సర్వే చేయడం కుదరదని, ఒకవేళ అలా చేస్తే జాతీయ ప్రాజెక్టుపై తీవ్ర ప్రభావం పడుతుందని వితండ వాదానికి తెరలేపింది. ఈ మేరకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కి ఇటీవల ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. పోలవరం ప్రాజెక్టు వల్ల తలెత్తే ముంపుపై సమగ్ర అధ్యయనం చేయించాలని, రక్షణ చర్యలు చేపట్టాలన్న డిమాండ్లను ఏపీ వ్యతిరేకించడంతో తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ సుప్రీంకోర్టును ఆశ్రయించడం.. ఆ దిశగా ఏకాభిప్రాయం సాధించాలని కేంద్ర జలసంఘానికి (సీడబ్ల్యూసీకి) కోర్టు స్పష్టమైన ఆదేశాలను జారీచేయడం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే కేంద్ర జల్శక్తి శాఖ బాధిత రాష్ర్టాలతో ప్రత్యేక సమావేశాలను నిర్వహించి ప్రాజెక్టు నిర్మాణంపై అభ్యంతరాలను, డిమాండ్లను తెలుసుకున్నది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం బలమైన వాదనలు వినిపించింది. పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణకు భారీగా ముంపు ప్రమాదం పొంచి ఉన్నదని, ప్రాజెక్టులో ఎఫ్ఆర్ఎల్ వరకు నీటిని నిల్వచేస్తే 891 ఎకరాలు ముంపునకు గురవుతున్నాయని పేర్కొన్నది. అయితే మారిన డ్యామ్ డిశ్చార్జి డిజైన్ వల్ల ముంపు మరింత పెరగడంతో స్థానిక డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోతున్నదని, ఫలితంగా ఇటీవల భద్రాచలం వద్ద గతంలో ఊహించిన దానికంటే ఎక్కువ మొత్తంలో వరద వచ్చిందని వివరించింది. బ్యాక్వాటర్ ప్రభావం వల్ల నదీ తీరాలు, స్థానిక వాగులు, పెద్దవాగు, ఈదుళ్లవాగు, పాములేరు వాగు, తురుబాకవాగుతోపాటు మొత్తంగా 31 వాగుల వెంబడి డ్రైనేజీ సమస్య కూడా తీవ్రంగా ఉంటుందని తెలిపింది. తద్వారా ప్రధాన నది వరదల ప్రభావం 60 గ్రామాలపై ఉంటుందని ఆది నుంచీ డిమాండ్ చేస్తున్న తెలంగాణ.. ఈ సమస్యల నివారణకు వెంటనే చర్యలు చేపట్టాలని సీడబ్ల్యూసీకి ఆధారాలతో సహా విన్నవించింది. 2018, 2020 ఎన్జీటీ ఆర్డర్లకు అనుగుణంగా జరిపిన అధ్యయన ఫలితాలను తెలంగాణ ఈ సందర్భంగా ఉటంకించింది.
తెలంగాణతో ఏకీభవించిన కేంద్ర జలసంఘం
ఈ వాదనలతో కేంద్ర జలసంఘం ఏకీభవించడంతోపాటు వెంటనే జాయింట్ సర్వే చేపట్టాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీకి, ఏపీ ప్రభుత్వానికి విస్పష్ట ఆదేశాలను జారీ చేసింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఏపీ ఎట్టకేలకు జాయింట్ సర్వేకు అంగీకరించాల్సి వచ్చింది. కానీ, ఈ సర్వేను ఆది నుంచి అడ్డుకోవాలని చూస్తున్న ఏపీ ప్రభుత్వం ఇప్పుడు మరో మెలికపెట్టింది. తెలంగాణ డిమాండ్ల మేరకు సర్వే చేయడం ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదని, కేవలం ఎఫ్ఆర్ఎల్ వద్ద బూర్గంపాడు వరకు వాటిల్లనున్న ముంపు వరకే సర్వే చేస్తామని పేచీలు పెడుతూ పీపీఏకి లేఖ రాసింది. దీనిపై తెలంగాణ అధికారులు మండిపడుతున్నారు.