ఎన్ఐఎన్ అధ్యయనానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావాన్ని అంచనా వేయడంతోపాటు ఎంతమందిలో యాంటిబాడీలు వృద్ధి చెందాయో తెలుసుకొనేందుకు అన్ని జిల్లాల్లో సిరో సర్వే నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇప్పటికే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) నాలుగుసార్లు మూడు జిల్లాల్లో కమ్యూనిటీ బేస్డ్ సర్వే చేపట్టింది. గత ఏడాది మే నెల నుంచి ఈ ఏడాది జూన్ వరకు ఐసీఎంఆర్-ఎన్ఐన్ ఆధ్వర్యంలో కామారెడ్డి, నల్లగొండ, జనగామ జిల్లాల్లో ఈ సర్వే నిర్వహించారు. తాజాగా మిగిలిన 30 జిల్లాల్లో సర్వే చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జీహెచ్ఎంసీతోపాటు, 30 జిల్లాల్లో ఒక్కో దగ్గర 600 నమూనాలు తీసుకొని సర్వే చేయనున్నట్టు ఎన్ఐఎన్ సీనియర్ శాస్త్రవేత్త లక్ష్మయ్య సోమవారం తెలిపారు. మూడు జిల్లాల్లో చేసిన నాలుగో విడత సర్వేలో 60 శాతం జనాభాలో కరోనాను ఎదుర్కోగల ప్రతిరక్షకాలను గుర్తించామని చెప్పారు. ఆరోగ్య సిబ్బందిలోనే 82.4 శాతం యాంటిబాడీలు ఉన్నట్టు తేలిందని అన్నారు.