హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) విద్యార్థులపై నిఘా పెట్టడం అప్రజాస్వామికమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. ప్రపంచంలో గుర్తింపు పొందిన బిజినెస్ స్కూల్లో శిక్షణ పొందే విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు. అలాంటి విద్యార్థులు సోషల్ మీడియాలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యానికి అనుకూలంగా పోస్టులు పెడితే.. వారిని బ్లాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి చర్యలు అత్యంత దుర్మార్గమని విమర్శించారు.