హైదరాబాద్ : తెలంగాణలో కొవిడ్ కేసులు పెరుగుతున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. నేటి నుంచి గాంధీ ఆస్పత్రిలో అత్యవసరం కాని శస్త్రచికిత్సలను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసరం కానీ సర్జరీలు తగ్గించాలని ప్రభుత్వం ఆదేశించింది. అత్యవసర శస్త్రచికిత్సల్లో ఎలాంటి ఆటంకం ఉండదని సర్కార్ స్పష్టం చేసింది. కొవిడ్ కేసుల పెరుగుదల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది.
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గింది. సోమవారం కొత్తగా 1,825 మందికి పాజిటివ్గా తేలింది. పాజిటివిటీ రేటు 3.5 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గింది. మరోవైపు 351 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కరోనా, ఇతర కారణాలతో ఒకరు మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 15వేలకు చేరుకొన్నది. రికవరీ రేటు కాస్త తగ్గి 97.26 శాతంగా నమోదైంది.
అత్యధికంగా జీహెచ్ఎంసీలో 1,042, మేడ్చల్ మల్కాజిగిరి 201, రంగారెడ్డి 147, సంగారెడ్డి 51, హనుమకొండలో 47 కేసులు నమోదయ్యాయి. ఆదివారం ఒక్క కేసు కూడా నమోదుకాని ములుగు జిల్లాలో 2 కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సోమవారం కేసులు నమోదయ్యాయి. అటు.. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 2.74 లక్షల మందికి టీకాలు వేశారు. ఇందులో 1.13 లక్షల మందికి మొదటిడోస్, 1.39 లక్షల మందికి రెండో డోస్, 22,045 మందికి బూస్టర్ డోస్ వేశారు. 15-18 ఏండ్లు మధ్య వయసు వారికి ఇప్పటి వరకు 7.52 లక్షల మదికి టీకాలు వేశారు.