న్యూఢిల్లీ, ఆగస్టు 25: మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) ద్వారా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి అపరిమిత అధికారాలు సంక్రమించటాన్ని సమర్థిస్తూ గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించేందుకు సుప్రీంకోర్టు గురువారం అంగీకరించింది. కాంగ్రెస్ నేత కార్తి చిదంబరం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ను విచారణకు స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. నిందితులకు ఈడీ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) ఇవ్వాల్సిన అవసరం లేకపోవటం, నిందితుడే తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవటం అనే నిబంధనలను పునఃపరిశీలిస్తామని ధర్మాసనం పేర్కొన్నది.
మనీ లాండరింగ్ నేరాల నిరోధానికి కోర్టు సంపూర్ణ మద్దతు ఇస్తుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టంలోని కొన్ని నిబంధనల చెల్లుబాటును సుప్రీంకోర్టు గత నెల 27న సమర్థిస్తూ.. మనీ లాండరింగ్కు పాల్పడటం సాధారణ నేరం కాదని, ఇలాంటి నేరాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థల పనితీరుకు ముప్పు వాటిల్లుతుందని అభిప్రాయపడింది. అయితే ఈ తీర్పుపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. చట్టంలోని లొసుగులను పరిశీలించకుండానే కోర్టు ఈ తీర్పు ఇచ్చిందని పేర్కొన్నాయి. కేంద్రం ఏకపక్ష సవరణలను కోర్టు సమర్థించడంతో రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు మోదీ సర్కారుకు మరింత బలం చేకూరినట్టయిందని ఆందోళన వ్యక్తంచేశాయి. తీర్పును సమీక్షించాలని కోరాయి.