Supreme Court | ఎమ్మెల్యేలు పార్టీ మారిన వ్యవహారంపై సుప్రీంకోర్టులో గురువారం మరోసారి విచారణ జరిగింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్ బెంచ్ ఎదుట స్పీకర్ కార్యదర్శి తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి విధింపుపై ఇప్పటి వరకు ఎలాంటి తీర్పులు లేవన్నారు. మణిపూర్ వ్యవహారం పూర్తిగా భిన్నమైందని.. ఆ ఒక్క విషయాన్ని ప్రత్యేకంగా పరిగణించారని తెలిపారు. రాణా కేసు పూర్తిగా ప్రత్యేకమైందని.. ప్రస్తుత అంశానికి సరిపోదని సింఘ్వి పేర్కొన్నారు. అయితే, జస్టిస్ బీఆర్ గవాయ్ స్పందిస్తూ రాణా కేసులో జోక్యం చేసుకొని అనర్హత విధించిందని ప్రస్తావించారు.
మీ దృష్టిలో ‘రీజనబుల్ టైమ్’ అంటే ఏంటని సింఘ్విని జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రశ్నించారు. సుప్రీంకోర్టుకు వచ్చిన తర్వాత న్యాయవాదుల తీరు పూర్తిగా మారిపోతుందని జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన వ్యాఖ్యలను మరోసారి ధర్మాసనం ఎదుట పాడి కౌశిక్రెడ్డి తరఫు న్యాయవాది ప్రస్తావించారు. అసెంబ్లీలో మాట్లాడితే ఏ కోర్టు నుంచైనా రక్షణ ఉంటుందని భావించారని న్యాయవాది సుందరం పేర్కొన్నారు. కనీసం సీఎం స్వీయ నియంత్రణ పాటించలేరా?.. గతంలో ఎలాంటి ఘనే జరిగిన తర్వాత కూడా ఇలాగే వ్యవహరిస్తే ఎలా? అని అంటూ సింఘ్విని జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు. ప్రతిపక్షం నుంచి అంతకు మించిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉన్నాయని సింఘ్వి తెలుపగా.. ఇప్పుడు అవన్నీ అప్రస్తుతమని పక్కన ధర్మాసనం పక్కనపెట్టింది.
సీఎం మాటలు కోర్టు ధిక్కారం కిందకు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. తాము సంయమనం పాటిస్తున్నామని.. మిగతా రెండు వ్యవస్థలు అదే గౌరవంతో ఉండాలని జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారు. స్పీకర్కు ఫిర్యాదు చేస్తే కోర్టు కేసులతో తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకురావాలని చూశారని స్పీకర్ కార్యదర్శి తరఫు న్యాయవాది పేర్కొనగా.. సింగిల్ జడ్జి సూచనలు పాటిస్తే కేసు ఇక్కడి వరకు వచ్చేది కాదని.. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన తర్వాతే నోటీసులు ఇచ్చారని జస్టిస్ గవాయ్ గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగా గెలిచి.. కాంగ్రెస్లో చేరినవారిపై అనర్హతపై సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, పాడి కౌశిక్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై బుధ, గురువారాల్లో విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం.. తుది తీర్పును రిజర్వ్ చేసింది.