Justice V. Ramasubramanian | హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా తాను హైదరాబాద్లో పనిచేసినప్పుడు తెలంగాణ ప్రాంతం మధుర జ్ఞాపకాలను ఇచ్చిందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీ రామసుబ్రమణియన్ గుర్తుచేసుకున్నారు. గురువారం హైకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జస్టిస్ వీ రామసుబ్రమణియన్ దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడా రు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ తెలంగాణ హైకోర్టు నుంచి పదోన్నతిపై హిమాచల్ప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తిగా వెళ్లిన తొలి వ్యక్తినని, ఉమ్మడి హైకోర్టు విభజన జరిగిన చారిత్రక ఘట్టంలో తానున్నానని వివరించారు.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రసంగిస్తూ నిజాంకాలం నాటి భూవివాదాల నుంచి అనేక కీలక తీర్పులను జస్టిస్ రామసుబ్రమణియన్ వెలువరించారని కొనియాడారు. కార్యక్రమంలో ఏజీ బీఎస్ ప్రసాద్, బార్కౌన్సిల్ చైర్మన్ ఏ నరసింహారెడ్డి, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పల్లె నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు చెం గల్వ కళ్యాణ్ రావు పాల్గొన్నారు.