న్యూఢిల్లీ: ఎమ్మెల్సీ కవితకు (MLC Kavitha) ఎట్టకేలకు బెయిల్ లభించింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టు ఈ ఏడాది మార్చి 15న కవితను ఈడీ అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఆమె తీహార్ జైలులో ఉంటున్నారు. అదే కేసులో ఏప్రిల్ 15న సీబీఐ ఆమెను అరెస్టు చేసింది. కాగా, దాదాపు ఐదు నెలలుగా రిమాండ్ ఖైదీగా జైలులో ఉంటున్న కవిత.. 11 కేజీల బరువు తగ్గారు. 153 రోజులు జైలులో ఉన్న ఆమె పలుమార్లు అస్వస్థతకు గురయ్యారు.
మార్చిలో జైలుకు వెళ్లిన కవిత జూలై 16న తొలిసారి అస్వస్థతకు గురయ్యారు. అప్పుడు కవితను ఢిల్లీలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ దవాఖానకు తరలించి చికిత్స అందించారు. రెండు రోజుల తర్వాత 18న ఆమెను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరచగా, తనకు ఎదురవుతున్న అనారోగ్య సమస్యలను జడ్జి కావేరి బవేజా దృష్టికి తీసుకెళ్లారు. కవిత విజ్ఞప్తి మేరకు ఢిల్లీ ఎయిమ్స్లో వైద్య పరీక్షలకు అనుమతి ఇచ్చారు. అప్పటి నుంచి ఆమె ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగుపడలేదు. జైలు వైద్యులే ఆమెకు వైద్యం అందిస్తున్నారు.
మళ్లీ ఆగస్టు 22న కవిత అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఢిల్లీ ఎయిమ్స్కు కవితను తరలించి.. ఆమె భర్త అనిల్ సమక్షంలో వైద్య పరీక్షలు చేశారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో తిరిగి జైలుకు తరలించారు. ఆమె సుమారు ఐదున్నర నెలల నుంచి జైలులోనే ఉన్నారు. జైలుకు వెళ్లిన తర్వాత ఆమె సుమారు 11 కేజీల బరువు తగ్గారు.