శ్రీశైలం : శ్రీశైల భ్రమరాంభ మల్లికార్జున స్వామి అమ్మవార్లను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్, ఆయన సతీమణి అమిత, ఏపీ హైకోర్టు జడ్జి ప్రశాంత్ కుమార్ మిశ్రా దంపతులు శనివారం దర్శించుకున్నారు. జస్టిస్ దంపతులకు శ్రీకృష్ణ దేవరాయ గోపురం వద్ద ఈవో లవన్న ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
స్వామిఅమ్మవార్ల మహామంగళ హారతి దర్శనాలు చేసుకుని మహన్యాసపూర్వక రుద్రాభిషేకము, బిల్వార్చన, అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన చేసుకుని హారతులు అందుకున్నారు. అనంతరం ఆలయ ప్రాకారంలోని పరివార దేవతలను దర్శించుకున్న జస్టిస్ దంపతులకు అమ్మవారి ఆలయ మండపంలో వేదాశీర్వచనాలు అందించి, తీర్థప్రసాదాలు అందించారు. జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ వెంట కర్నూల్ జిల్లా ప్రిన్సిపల్ జడ్జి రాధాకృష్ణ కృపాసాగర్, నంద్యాల జిల్లా కలెక్టర్ మనజీర్జిలానీ సామూన్, జిల్లా ఏస్పీ రఘువీర్ రెడ్డి ఉన్నారు.