హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. క్వాష్ పిటిషన్ను ఏపీ హైకోర్టు తోసిపుచ్చడాన్ని సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే.
జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ముందు మంగళవారం ఉభయపక్షాలు తమ వాదనలు వినిపించాయి. రెండువైపులా వాదనలు విన్న ధర్మాసనం.. ఉభయపక్షాలు అఫిడవిట్లు సమర్పించాలని, ఈ కేసులో ఏపీ సీఐడీ ఆ రాష్ట్ర హైకోర్టుకు సమర్పించిన పత్రాలన్నింటినీ తమ కు కూడా అందజేయాలని ఆదేశించింది. ఇప్పటికిప్పు డు ఈ అంశాన్ని తేల్చలేమని పేర్కొంటూ విచారణను సోమవారానికి వాయిదా వేసింది. చంద్రబాబు పక్షాన సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ్ లూథ్రా, హరీశ్ సాల్వే, అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించగా, సీఐడీ పక్షాన ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.
అమరావతి ఇన్నర్రింగ్ రోడ్డు కేసులో టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ను ఈ నెల 10న సీఐడీ ముందు విచారణకు హాజరు కావాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ కేసులో లోకేశ్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. సీఐడీ ఇచ్చిన 41ఏ నోటీసులోని నిబంధనలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ లోకేశ్ పిటిషన్ దాఖలు చేశారు. లోకేశ్ తరఫున పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ.. హెరిటేజ్ సంస్థలో లోకేశ్ షేర్ హోల్డర్ అని, ఆయనకు తీర్మానాలు ఇవ్వాలన్నా, బ్యాంకు ఖాతా పుస్తకాలు ఇవ్వాలన్నా కంపెనీ ప్రొసీజర్ ఉంటుందని వివరించారు. తాము డాక్యుమెంట్లపై ఒత్తిడి చేయబోమని, బుధవారమే విచారణకు హాజరు కావాలని సీఐడీ తరఫు న్యాయవాదులు కోరారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం అక్టోబర్ 10న సీఐడీ విచారణకు లోకేశ్ హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.