పెబ్బేరు, ఆగస్టు 16: 57 ఏండ్లు నిండిన వారికి త్వరలో కొత్త పింఛన్లు పంపిణీ చేయనున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. కొత్త పింఛన్లకు అర్హత పొందిన వారికి మంగళవారం ఆయన వనపర్తి జిల్లా పెబ్బేరులోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు మంజారు చేసేందుకు కృషి చేస్తామన్నారు. వనపర్తి జిల్లాలో 16,023 కొత్త పింఛన్లు మంజూరైనట్టు పేర్కొన్నారు. కొత్త పింఛన్లను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసిందన్నారు. కొత్త, పాత పింఛన్ల లబ్ధిదారులకు బార్కోడ్తో కూడిన కార్డులను పంపిణీ చేస్తామని తెలిపారు.