హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడం వల్ల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) తీవ్రంగా నష్టపోయాయని, వాటిని ఆదుకొనేందుకు సత్వరమే తగిన చర్యలు తీసుకోవాలని ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్టీసీసీఐ) కేంద్ర ఆర్థికమంత్రితోపాటు ఆర్బీఐ గవర్నర్కు విజ్ఞప్తిచేసింది. అత్యవసర రుణ పథకాన్ని ప్రవేశపెట్టాలని, రుణ వాయిదాల చెల్లింపు గడువును పెంచాలని, ప్రోత్సాహకాలు ప్రకటించాలని కోరింది. ఈ మేరకు గురువారం ఆన్లైన్లో ఇద్దరికి లేఖలు పంపించింది. లాక్డౌన్ కారణంగా తలెత్తిన ఇబ్బందులు, దాన్నుంచి బయటపడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు గురువారం ఎఫ్టీసీసీఐ ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎంఎస్ఎంఈలపై ప్రధానంగా చర్చించారు. లాక్డౌన్ వల్ల వ్యాపారాలు సాగక రుణ వాయిదాలు చెల్లించే పరిస్థితిలో ఎంఎస్ఎంఈలు లేవని, ఈ క్రమంలో ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరముందని పేర్కొన్నారు. వడ్డీ రేట్లను తగ్గించడంతోపాటు వాయిదాల కోసం బ్యాంకులు ఒత్తిడి చేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఎఫ్టీసీసీఐ అధ్యక్షుడు రమాకాంత్ ఇనానీ, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ భాస్కర్రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ అనిల్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.