నీలగిరి, ఫిబ్రవరి 16 : లంచం తీసుకుంటూ నల్లగొండ జనరల్ దవాఖాన సూపరింటెండెంట్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకన్న అనే కాంట్రాక్టర్ టెండర్ ద్వారా నల్లగొండ ప్రభుత్వ దవాఖానకు కొన్నేండ్లుగా మందులు సరఫరా చేస్తున్నారు. తాజాగా జిల్లా కొనుగోలు కమిటీ చైర్మన్ ఆదేశాల ప్రకారంగా నాన్ టెండర్ ద్వారా ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో మందుల సరఫరాకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సదరు కాంట్రాక్టర్ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ లచ్చూనాయక్ను సంప్రదించారు.
45 రోజులుగా కాలయాపన చేస్తుండటంతో వెంకన్న నెల రోజుల క్రితం లక్ష రూపాయలు ముట్టజెప్పారు. అయినా ఆర్డర్స్ ఇవ్వకపోవడంతో పదిహేను రోజుల క్రితం మరో లక్ష చెల్లించారు. అయినా తనకు వాటా సరిపోలేదని మరో రూ.3 లక్షలు కావాలని లచ్చూనాయక్ డిమాండ్ చేశాడు. దాంతో వెంకన్న ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. శుక్రవారం ప్రకాశం బజార్లోని ఆయన నివాసంలో లచ్చూనాయక్కు వెంకన్న రూ.3 లక్షలు అప్పగిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం లచ్చూనాయక్ ఇంట్లో సోదాలు చేసి పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.