Summer | హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సూరీడు సుర్రుమంటున్నాడు. బుధవారం ఏకంగా 20 మండలాల్లో 44 డిగ్రీలపైనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా, ఒకటి రెండు రోజుల్లో 45 డిగ్రీలు దాటేలా ఉన్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా నల్గొండ జిల్లా నిడమనూర్లో 44.8 డిగ్రీలు, నాంపల్లి, నల్గొండ పట్టణంలో 44.7 డిగ్రీలు, మునుగోడులో 44.5 డిగ్రీలు, హాలియాలో 44.4 డిగ్రీలు నమోదయ్యాయి.
అన్ని జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు 41.5 డిగ్రీలు దాటాయి. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. మంచిర్యాల జిల్లా దండేపల్లిలో 2.8 మి.మీ వర్షం కురిసినట్టు వాతావరణ శాఖ తెలిపింది. మూడు రోజులపాటు వాతావరణం పొడిగా ఉంటుందని, మూడోరోజు కొన్ని చోట్ల చిరుజల్లులు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది.