హుజూరాబాద్ : “ఖబర్దార్ ఈటల రాజేందర్.. నువ్వు దళిత ద్రోహివి” అని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. ఆయన బుధవారం ఇల్లందకుంట మండల కేంద్రంలో జడ్పీ చైర్మన్ కనుమల్ల విజయ గణపతి,ఎంపీపీ పావని వెంకటేష్, స్థానిక నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సుంకే రవిశంకర్ మాట్లాడుతూ..”దళిత బంధుపై ఈటల కుట్ర చేస్తున్నారని, దళితులు బాగు పడడం ఈటలకు ఇష్టంలేదని” అన్నారు.
“దళిత బంధును అపేయాలని ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడం సిగ్గు చేటని, ఇందుకు వచ్చే ఎన్నికల్లో మూల్యం చేల్లించుకుంటావ్.. సొంతంగా ఆస్తులను కూడ బెట్టుకునేందుకే ఈటల తాపత్రయం దళితులను ఏనాడైనా ఈటల పట్టించుకున్నాడా..? అని ఈటలను సుంకె రవిశంకర్ నిలదీశారు.
“సీఎం కేసీఆర్ దళితులను లక్షాధికారులను చేయాలని చూస్తే.. ఈటల ఓర్వలేకపోతున్నాడు. అలాంటి ఈటలను వచ్చే ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలి. ఈటలకు ఓటమి భయం పట్టుకుంది. అసహనంతో ఊగిపోతున్నాడు. తన బాధను ప్రపంచ బాధగా చిత్రీకరిస్తున్నాడు. బీజేపీ గెలువక ముందే దళిత బంధును అపాలని చూస్తోందని” అన్నారు.
“ఒకవేళ గెలిస్తే.. పరిస్థితి ఏమిటీ..ఇప్పటికే దళిత భూములపై ఈటల కన్నేశాడు. అసైన్డ్ భూములను బలవంతంగా గుంజుకున్నాడు. ఈటలకు దళితుల గోస తప్పకుండా తగులుతది. ఈటల రాజేందర్ రాజీనామా ఎందుకు చేశాడో హుజూరాబాద్ ప్రజలకు వివరించాలి. ఈ ప్రాంత ప్రజలు బాగుపడాలో లేక ఈటల బాగుపడాలో ఆలోచించాలి. ఏడేళ్లు మంత్రిగా ఉండి ఏమి చేయలేనోడు ప్రతి ప్రక్ష ఎమ్మెల్యేగా ఉండి ఏమి చేస్తాడు” అని ఆయన అన్నారు.
“టీఆర్ఎస్ కు వస్తున్న ఆదరణ చూసి ఈటలకు మతిపోతుంది.టీఆర్ఎస్ ఇచ్చిన మాటకు కట్టుబడి దళిత బంధును అమలు చేస్తోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలను లూటీ చేస్తోంది. గుజరాత్ నుంచి నలుగురు బయలుదేరి దేశాన్ని అమ్ముకుంటున్నారు. బీజేపీ అమ్మకానికి కేరాఫ్ గా మారితే టీఆర్ఎస్ ఇచ్చిన మాటకు కట్టుబడి నమ్మకానికి కేరాఫ్ గా నిలిచింది. రైతుల కష్టాన్ని తన కష్టంగా భావించి రైతు బంధును గౌరవనీయులు మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్తుంటే కేంద్రం ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తుందని” సుంకె రవిశంకర్ మండిపడ్డారు.