యాదాద్రి భువనగిరి : కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధుల మాటలు నమ్మి విచారణ చేయకుండానే అధికారులు బీఆర్ఎస్ భవనాన్ని కూల్చడం దారుణమని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునితాలక్ష్మారెడ్డి (Sunita Lakshmareddy) అన్నారు. జిల్లాలోని మల్లాపురంలో బీఆర్ఎస్ భవనం కూల్చి వేత పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు సదరు భవనాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని అధికార కార్య కలాపాలు వినియోగించే అవకాశం ఉంది.
అయినా కూడా విచక్షణారహితంగా కూల్చి వేయడం సరికాదన్నారు. శాంతియుతంగా ఉన్న ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అరాచకాలు సృష్టిస్తున్నదని మండిపడ్డారు. ప్రతి గ్రామంలోని ప్రభుత్వ భూముల్లో నిర్మించిన స్మశాన వాటిక, డంపింగ్ యార్డులను కూల్చేస్తారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ అంటే అధికార పార్టీకి భయం పట్టుకుందని, కాంగ్రెస్ పాపాలకు ఒడిగడుతుందన్నారు.
యాదగిరిగుట్ట మండలం మల్లాపురం(Mallapuram)లో అర్ధరాత్రి 2 గంటల సమయంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని(BRS party office) కూల్చివేశారు.100 పోలీసుల పహారాతో జేసీబీతో నేలమట్టం చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ దాడులకు దిగింది. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పేరిట రెండేండ్ల క్రితం 150 గజాలలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మాణం చేపట్టారు.
కాగా, అధికారంలోకి వచ్చి రెండు నెలలు కాకముందే ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య దురాగాతాలకు ఒడిగడుతున్నాడు.
బీఆర్ఎస్పై దాడులకు పాల్పడుతూ గ్రామాల్లో భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. జాయింట్ కలెక్టర్ అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు మండి పడుతున్నారు. ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తీరుపై మల్లాపురం గ్రామస్తుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.