హైదరాబాద్: గత కొంతకాలంగా నగరవాసులను అలరిస్తున్న సండే ఫండే కార్యక్రమంపై ఒమిక్రాన్ ఎఫెక్ట్ పడింది. ప్రతి ఆదివారం ట్యాంక్బండ్, చార్మినార్ వద్ద నిర్వహిస్తున్న సండే ఫండే, ఏక్ శామ్ చార్మినార్ కే నామ్ పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమాలు ప్రజలను అలరిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అలజడి నేపథ్యంలో డిసెంబర్ 12న (ఆదివారం) ట్యాంక్బండ్ వద్ద సండే-ఫన్డే, పాతబస్తీలో ‘ఏక్ శాం-చార్మినార్ కే నామ్’ వినోద కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్ తెలిపారు. పరిస్థితులు కుదుటపడిన తర్వాత యథావిధిగా నిర్వహిస్తామని వెల్లడించారు.
హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో గతకొన్ని రోజులుగా ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న సండే ఫండ్ కార్యక్రమానికి నగర వాసుల నుంచి విశేష స్పందన లభించింది. ప్రతివారం ప్రత్యేక షోలు నిర్వహిస్తూ సందర్శకులను ఆకట్టుకుంటున్నారు. అక్కడ ఏర్పాటుచేసిన వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.