వేసవిని విజయవంతంగా ఎదుర్కొన్నాం
వానకాలానికి ప్రత్యేక కార్యాచరణ
దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జీ రఘుమారెడ్డి వెల్లడి
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 13 (నమస్తే తెలంగాణ): నిరంతరం నాణ్యమైన విద్యుత్తును అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జీ రఘుమారెడ్డి చెప్పారు. వేసవికాలాన్ని విజయవంతంగా ఎదుర్కొన్నామని, వానకాలానికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. వేసవి సీజన్ ముగిసి, వర్షాకాలం సీజన్ ప్రారంభవుతున్న నేపథ్యంలో సంస్థ చేపడుతున్న కార్యాచరణపై ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ వేసవిలో దేశవ్యాప్తంగా పలు రాష్ర్టాలు, నగరాల్లో విద్యుత్తు కోతలున్నా, తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో ఎలాంటి కోతలు లేకుండా 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్తును సరఫరాచేశామని గుర్తు చేశారు. దానికి అనుగుణంగానే సమ్మర్ యాక్షన్ ప్లాన్ వర్క్స్ కోసం రూ.273.07 కోట్లను కేటాయించామని రఘుమారెడ్డి వివరించారు. ఈ నిధులతో 33 కేవీ లైన్లను 213.92 కిలోమీటర్ల మేర వేశామని, అదనంగా 65 పవర్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటుచేయగా, 72 పవర్ ట్రాన్స్ఫార్మర్లను మెరుగుపర్చామని వెల్లడించారు.
సర్కిళ్లవారీగా కంట్రోల్ రూమ్ల ఏర్పాటు
ప్రస్తుత వర్షాకాలంలో విద్యుత్తు సరఫరా వ్యవస్థకు అంతరాయం కలగకుండా ముందస్తు కార్యాచరణను రూపొందించి ముందుకు వెళ్తున్నట్టు రఘుమారెడ్డి చెప్పారు. ముఖ్యంగా ఈదురుగాలులతో విద్యుత్తు లైన్లు దెబ్బతినకుండా సర్కిళ్లవారీగా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. సర్కిల్ పరిధిలో డివిజన్లవారీగా ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొనేలా ప్రత్యేక బృందాలను 15 మందితో ఏర్పాటుచేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు. వర్షాకాలంలోనూ నిరంతరం నాణ్యమైన విద్యుత్తు అందించడానికి యంత్రాంగం పనిచేస్తూనే ఉంటుందని తెలిపారు. విద్యుత్తు పంపిణీ సంస్థలో ఉద్యోగాలు ఇస్తామని కొందరు దళారులు చేసే వదంతులను నిరుద్యోగులు నమ్మొదని సూచించారు. సంస్థ పరిధిలో ఇటీవలే 70 జూనియన్ లైన్మెన్, 201 సబ్ ఇంజినీర్స్, 70 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశామని, పారదర్శకంగా భర్తీ ప్రక్రియ చేపడుతున్నామని తెలిపారు.