ఎస్సీఈఆర్టీ షెడ్యూల్ విడుదల
ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు?
హైదరాబాద్, మార్చి 30 : రాష్ట్రంలో 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 7 నుంచి 18 వరకు సమ్మేటివ్ అసెస్మెంట్ (ఎస్ఏ) పరీక్షలు నిర్వహించాలని ఎస్సీఈఆర్టీ ఆదేశించింది. కరోనా సమయంలో 47 రోజులపాటు వర్చువల్గా బోధించిన పాఠ్యాంశాలకుగాను ఈ పరీక్షలు నిర్వహించాలని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి బుధవారం సూచనలు ఇచ్చారు. ఈ పరీక్షల జవాబు పత్రాలను ఏప్రిల్ 20లోగా మూల్యాంకనం చేసి విద్యార్థులకు అందజేయాలని, 23లోగా ఫలితాలు వెల్లడించాలని తెలిపారు.
24 నుంచి సెలవులిచ్చే యోచన
పాఠశాలలకు ఈ నెల 24 నుంచి వేసవి సెలవులిచ్చే యోచనలో విద్యాశాఖ అధికారులు ఉన్నారు. ఇదే విషయాన్ని గతంలో వెల్లడించిన అకడమిక్ క్యాలెండర్లో అధికారికంగా ప్రకటించారు. జూన్ 13న పాఠశాలలు తెరుచుకొంటాయని అకడమిక్ క్యాలెండర్లో పొందుపరిచారు. 1-9 తరగతల విద్యార్థులకు అకడమిక్ క్యాలెండర్ ప్రకారమే వేసవి సెలవులు ఉంటాయని ఎస్సీఈఆర్టీ అధికారులు తెలిపారు. వార్షిక పరీక్షల దృష్ట్యా 10వ తరగతి విద్యార్థులకు తరగతులు కొనసాగుతాయని, త్వరలోనే ప్రీ ఫైనల్ పరీక్షల షెడ్యూల్ను విడుదల చేస్తామని పేర్కొన్నారు. 10వ తరగతికి బోధించే టీచర్లు పాఠశాలలకు హాజరుకావాల్సి ఉంటుందని, ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే వెలువడతాయని తెలిపారు.