సత్తుపల్లి రూరల్, మే 9: ఇద్దరు పిల్లలు సహా వివాహిత చెరువు లో దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి శివారులో మంగళవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన పాటిబండ్ల ప్రశాంత్, మృదుల (40) దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు ప్రజ్ఞాన్(8), మహాన్(5). ప్రశాంత్ బెట్టింగ్ల కు అలవాటుపడి డబ్బులు పోగొట్టుకున్నాడు. అప్పులపాలై ఆస్తులన్నీ అమ్మాడు. అత్తగారిచ్చిన భూమి అమ్మకంలో జాప్యం జరుగుతుండటం..
భర్త ఒత్తిడి పెంచడంతో మృదుల తట్టుకోలేకపోయింది. ఆదివారం పెద్ద కుమారుడు ప్రజ్ఞాన్ కాలికి తన చున్నీతో కట్టి, చిన్న కుమారుడు మహాన్ను ఎత్తుకొని సత్తుపల్లి శివారులోని తామరచెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడింది. మృదుల ఇంటికి రాలేదని కుటుంబ సభ్యులు సత్తుపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా తామరచెరువు వద్ద గాలింపు చర్యలు చేపట్టగా.. అక్కడ సంచి, సెల్ఫోన్, చెప్పులు లభించాయి. మంగళవారం ఉదయం గజ ఈతగాళ్లు మృదుల, ఆమె ఇద్దరు పిల్లల మృతదేహాలను బయటకు తీశారు.