కేసముద్రం, డిసెంబర్ 13: అప్పులు చేసి సాగు చేస్తే పంటలు చేతికి రాకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన రైతు దంపతులు ఈ నెల 8న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా చికిత్స పొందుతూ భర్త బుధవారం మృతి చెందాడు. భార్య పరిస్థితి విషమంగా ఉన్నది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని క్యాంపు తండాలో చోటుచేసుకున్నది.
బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన ధరావత్ వీరన్న (40), లలిత దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు. వారసత్వంగా వచ్చిన మూడున్నర ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఎకరన్నర భూమిలో మిర్చి, ఎకరం విస్తీర్ణంలో పత్తి సాగు చేశారు. మిర్చికి గుబ్బ రోగం రాగా పంటను కాపాడుకోవడానికి క్రిమిసంహారక మందులు పిచికారీ చేశారు. అయినా పంట చేతికి రాకపోవడం, మరోవైపు పత్తి పంట దిగుబడి తగ్గిపోయింది.
మిగ్జాం తుఫాన్ కారణంగా చేతికి అందివచ్చిన వరి వర్షానికి తడిసి మొలకెత్తింది. మిర్చి, పత్తి, వరి పంటలకు సుమారు రూ.3 లక్షల వరకు అప్పు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టారు. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో అప్పులు తీర్చలేమని భావించిన దంపతులు మిర్చి తోట వద్ద ఈనెల 8న పురుగుల మందు తాగారు.
చుట్టుపక్కల రైతులు గమనించి వారిని మహబూబాబాద్ ఏరియా దవాఖానకు తరలించారు. వీరన్న పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించగా బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు. లలిత మహబూబాబాద్లో చికిత్స పొందుతుండగా, ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్టు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. వీరన్న తండ్రి లచ్చు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై తిరుపతి తెలిపారు.