Elephant | హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): ఏనుగులు జనావాసాల్లోకి రావడానికి ఓ ప్రత్యేక కారణమూ ఉన్నదని అటవీ అధికారులు తెలిపారు. పుచ్చ, చెరుకు పంట చేల వైపు అవి ఎంత దూరమైనా సాగిపోతాయని చెప్పారు. దూరం నుంచే ఆ చేల వాసనను ఏనుగులు పసిగడతాయని తెలిపారు. వాటిని తినాలనే కోరికతోనే ఇటీవల ప్రాణహిత నది దాటి ఓ ఏనుగు మన రాష్ట్రంలోని సరిహద్దు గ్రామాల పరిధిలోకి వచ్చి బీభత్సం సృష్టించిందని తేల్చి చెప్పారు.
ఓ ఇద్దరిని బలిగొన్న ఆ ఏనుగు మూడు రోజుల క్రితమే మహారాష్ట్ర అటవీ ప్రాంతంలోకి వెళ్లిందని నిర్ధారించారు. ఆసిఫాబాద్ జిల్లాలోని పెంచికల్పేట పరిధిలోని కొండపల్లి గ్రామంలో పుచ్చకాయ, బెజ్జూరు పట్టణ శివార్లలో రైతులు చెరుకు పంటను సాగుచేశారు. సలుగుపల్లిలోని చెరుకు చేనులోకి ఏనుగు ప్రవేశించినప్పటికీ పంట చాలా చిన్నదిగా ఉన్నది.
ఏప్రిల్ 4న పుచ్చకాయ చేనులో నీరు పెడుతున్న రైతును ఏనుగు తొకి చంపింది. ఏనుగు గతంలో పలుమార్లు ప్రాణహితకు చేరుకున్నదని, గడ్చిరోలి మీదుగా ఛత్తీస్గఢ్కు వెళ్లిందని కుమ్రంభీం ఆసిఫాబాద్ డీఎఫ్వో తెలిపారు. ఏప్రిల్ 3న తొలిసారిగా తెలంగాణలోకి ప్రవేశించిందని తెలిపారు. సరిహద్దు గ్రామాల ప్రజలు మరికొన్ని రోజులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
ఏనుగు గుంపుతో తిరిగొస్తుందని హెచ్చరిక
మహారాష్ట్ర అడవుల్లోకి వెళ్లిన ఏనుగు మళ్లీ మన అడవుల్లోకి తిరిగొచ్చే ప్రమాదం ఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గుంపు నుంచి విడిపోయి ఒంటరిగా వచ్చిన ఏనుగు తిరిగి గుంపులో కలిస్తే, ఆహారం, ఆవాసం కోసం మళ్లీ అదే గుంపుతో కలిసి ప్రాణహిత నది దాటి వచ్చే ప్రమాదం ఉన్నదని చెప్పడంతో కుమ్రంభీం జిల్లా అటవీశాఖ అలర్ట్ అయింది.
నిపుణులతో అటవీ సిబ్బందికి అవగాహన
ఏనుగు మళ్లీ వస్తే తీసుకోవాల్సిన చర్యలపై అటవీశాఖ దృష్టి పెట్టింది. ఛత్తీస్గఢ్ అటవీశాఖ ట్రాకింగ్ టీమ్, వైల్డ్లైఫ్ నిపుణులతో సిబ్బందికి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఫారెస్ట్ వాచర్లు, బీట్ ఆఫీసర్లు, డిప్యూటీ రేంజర్లు, రేంజర్లు, ఎఫ్డీవోలకు కోల్కతాకు చెందిన సేజ్ సంస్థ చీఫ్ రితీశ్దరి అవగాహన కల్పించారు. జనారణ్యంలోకి వచ్చిన ఏనుగులకు ఎలాంటి ఆహారం, నీరు సమకూర్చవద్దని, ఏనుగు ఉన్న చోటుకు ఒంటరిగా వెళ్లవద్దని సూచించారు.