జనగామ : వరంగల్ ఉమ్మడి జిల్లాలో సంచలనం సృష్టించిన రిటైర్డ్ ఎంపీడీవో రామకృష్ణయ్య హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్య జరిగిన మూడు రోజుల్లోనే నిందితుల్లో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. హత్య వివరాలతో పాటు నిందితుల వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్(Warangal CP) ఏ.వి. రంగనాథ్ ఆదివారం వెల్లడించారు.
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పోచన్నపేట గ్రామానికి చెందిన రిటైర్డ్ ఎంపీడీవో నల్లా రామకృష్ణయ్య (70)(Retired MPDO) సర్వే నం 174 భూములకు సంబంధించిన విషయంలో గిరబోయిన అంజయ్యతో తగాదాలు నడుస్తున్నాయి. ఈ విషయంలో రిటైర్డ్ ఎంపీడీవో అధికారులకు ఫిర్యాదు చేయడంతో కక్షను పెంచుకున్న అంజయ్య బచ్చన్నపేటకు చెందిన దండుగుల తిరుపతిని సంప్రదించాడు. రామకృష్ణయ్యను అంతమొందిస్తే రూ. 8లక్షలు ఇస్తానని రూ.50వేలు అడ్వాన్స్గా ఇచ్చాడు. దీంతో తిరుపతి మరో ముగ్గురు డోలకొండ శ్రీకాంత్, శివరాత్రి బాషా ఆలియాస్ భాస్కర్, దండుగుల రాజు అనే వ్యక్తులతో కలిసి రామకృష్ణయ్య హత్యకు వ్యూహరచన చేశారు.
ఈనెల 15న సాయంత్రం 5.30 నిమిషాలకు పోచన్నపేట గ్రామ శివారు ప్రాంతంలో బచ్చన్నపేట నుంచి పోచన్నపేటకు వెళుతున్న కారుతో అటకాయించి రామకృష్ణయ్యను నలుగురు బలవంతంగా కారులోకి ఎక్కించుకుని తీసుకెళ్లారు. అనంతరం చిన్నరామన్చర్ల గ్రామ శివారు ప్రాంతంలో రామకృష్ణయ్యను కారు నుంచి దింపి టవల్తో మెడను బిగించి ఊపిరి అడకుండా చేసి దారుణంగా హత్య (Murder)చేశారని సీపీ వెల్లడించారు. అనంతరం చంపక్ హిల్స్ ప్రాంతంలోని క్వారీ నీటిగుంటలో రామకృష్ణయ్య మృతదేహాన్ని పడేసి నలుగురు నిందితులు పారిపోయారని తెలిపారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తును ప్రారంభించిన పోలీసులు ప్రధాన నిందితుడు అంజయ్యను గుర్తించి విచారించగా నిందితుల పేర్లు బయటకు వచ్చాయని తెలిపారు. అంజయ్యతోపాటు డోలకొండ శ్రీకాంత్, భాస్కర్ను అరెస్టు(Arrest) చేశామని, దండుగుల తిరుపతి, దండుగుల రాజు పరారీలో ఉన్నారని వివరించారు. నిందితుల నుంచి కారు, మూడు సెల్ఫోన్లు , రూ. 15వేల నగదును స్వాధీనం చేసుకున్నామని సీపీ పేర్కొన్నారు. ఈ హత్య కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన వెస్ట్ జోన్ డీసీపీ సీతారాం, జనగామ ఏసీపీదేవేందర్ రెడ్డి, ఫోర్స్ ఏసీపీ జితేందర్ రెడ్డి, నర్మెట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగబాబు, బచ్చన్నపేట ఎస్.ఐ నవీన్, టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాంబాబు, ఎస్.ఐ దేవేందర్, శరతో పాటు సిబ్బందిని సీపీ అభినందించారు.