Government Schools | హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ) : ప్రైవేట్ స్కూళ్లకు 9 గంటలకే అంటే 9లోపు.. 10 గంటలకే అంటే 10 గంటలకే టీచర్లు వస్తారు. అదే సర్కారు బడులకు 9 అంటే 10 గంటలకు, 10 అంటే 11 గంటలకొచ్చేవాళ్లున్నారు. స్కూళ్లో ముగ్గురు టీచర్లుంటే వచ్చేది ఇద్దరే. ఇక షిప్టులు, వంతులు పెట్టుకొని ఒకరు స్కూళుకెళ్లి, మరొకరు డుమ్మాకొడుతున్న పరిస్థితులున్నాయి. కానీ జీతాలు మాత్రం పూర్తిగా తీసుకొంటారు. ఇది ప్రైవేట్కు.. సర్కారు బడులకున్న తేడా. ఈ విషయాలన్నీ నాకు తెలుసు. అన్నింటిపై నాకు స్పష్టమైన అవగాహన ఉన్నది. ఇక నుంచి ఇలాంటి వాటిని ఉపేక్షించం. ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ను (ఎఫ్ఆర్ఎస్) పటిష్టంగా అమలుచేయాలి. అన్నిశాఖలు, కార్యాలయాల్లో ఈ హాజరు అమలవుతుంది. సీఎం, సీఎస్ సహా ఐఏఎస్ అధికారులంతా ఎఫ్ఆర్ఎస్ హాజరును నమోదుచేయాలి. ఇటీవలే విద్యాశాఖపై సమీక్షలో సీఎం రేవంత్రెడ్డి అధికారులతో అన్న మాటలివి (అధికార వర్గాల కథనం ప్రకారం). విద్యాశాఖను స్వయంగా పర్యవేక్షిస్తున్న సీఎం ఇలా వ్యాఖ్యానించడంతో విద్యాశాఖ అప్రమత్తమైంది. సర్కారు బడులను గాడినపెట్టే పనిలో నిమగ్నమైంది.
కలెక్టర్ల చేత ఆకస్మిక తనిఖీలు
సర్కారు బడులను గాడిలో పెట్టడంలో భాగంగా జిల్లా కలెక్టర్ల చేత ఆకస్మిక తనిఖీలు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారంలో రెండు చొప్పున బడులను తనిఖీచేసేలా త్వరలోనే ఆదేశాలివ్వనున్నది. ఈ ఆకస్మిక తనిఖీ పూర్తైన ర్వాత కలెక్టర్లు పూర్తిస్థాయి నివేదికను రూపొందించి అటు విద్యాశాఖకు.. ఇటు ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. సర్కారు బడులపై ప్రజల్లో సదాభిప్రాయంలేదని, ఇందుకు టీచర్లు ఓ కారణమని ప్రభుత్వం గుర్తించింది. గ్రామీణ ప్రాంతాల్లోని టీచర్లు విధులకు గైర్హాజరవుతున్నట్టుగా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆకస్మిక తనిఖీల ద్వారా బడులను బలోపేతం చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వమున్నది. కాగా, వచ్చే జూన్లోపు ‘మన ఊరు -మన బడి’ కార్యక్రమంలో చేపట్టిన స్కూళ్లే కాకుండా అన్ని స్కూళ్లలో సరిపడ నీటి వసతి, టాయిలెట్లు, తాగునీరు, బెంచీలు వంటి సౌకర్యాలను కల్పించాలని విద్యాశాఖ యోచిస్తున్నది.
గతంలో వ్యతిరేకించిన సంఘాలు
పాఠశాల్లో టీచర్ల హాజరును పర్యవేక్షించేందుకు అమలుచేసిన ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ (ఎఫ్ఆర్ఎస్)ను హాజరు విధానాన్ని గతంలో పలు ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. టీచర్లపై పెత్తనమేంటని ప్రశ్నించాయి. ఈ విధానంపై టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో విద్యాశాఖ వెనక్కితగ్గింది. దీంతో అరకొరగానే ఎఫ్ఆర్ఎస్ అమలవుతున్నది. తాజాగా సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలతో పూర్తిస్థాయిలో ఎఫ్ఆర్ఎస్ అమలుకు విద్యాశాఖ సమాయత్తమవుతున్నది.