Cyber Crime | హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): ‘తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందండి’.. అనే సైబర్ నేరగాళ్ల మాయమాటలకు ఉన్నత విద్యావంతులు సైతం పడిపోతున్నారు. అత్యాశకు పోయి కష్టార్జితాన్ని సమర్పించుకుంటున్నారు. ఈ ఏడాది నమోదైన సైబర్ నేరాల్లో ‘ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్’ టాప్లో ఉన్నాయి. తర్వాతి స్థానాల్లో ఫేక్ లోన్లు, ఫేక్ కస్టమర్ సేవలు వంటి మోసాలు ఉన్నట్టు సైబర్ నిపుణులు వెల్లడించారు. మన అత్యాశే సైబర్ నేరగాళ్లకు పెట్టుబడిగా మారుతున్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2019లో ఈ తరహా 2,013 కేసులు నమోద వ్వగా, ప్రస్తుతం ఏటా వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. ఒక్క 2022-23లో సుమారు 50,374 ఫిర్యాదులు నమోదయ్యాయి.
తగ్గుముఖం పట్టిన పలు సైబర్ నేరాలు
సైబర్ నేరాలు మొదలైన కొత్తలో మీకు గిఫ్ట్ వచ్చిందని, బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యాయని, విదేశీ సంబంధమని, బ్యాంకు మేనేజర్ పేరిట, లక్షల్లో లాటరీ తగిలిందనే తరహా మోసాలు విపరీతంగా జరిగేవి. ఆ నేరాల్లో ఎక్కువగా సాంకేతికత తెలియనవారు మోసపోయేవారు. తెలంగాణ పోలీసులు క్షేత్రస్థాయిలో సైబర్ నేరాలపై విస్తృతంగా అవగాహన కల్పించడం, విద్యార్థులతో ఓ సైబర్ ఆర్మీని ఏర్పాటు చేసి వారితో తల్లిదండ్రులకు, బంధువులకు మోసాల గురించి తెలియజెప్పడంతో ప్రజల్లో చైతన్యం పెరిగింది. దీంతో నేరగాళ్లు కొత్త ఎత్తుగడలు వేస్తూ వస్తున్నారు. చదువుకున్నవారిని, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లను టార్గెట్ చేశారు.
రోజుకొక ఎత్తుగడ.. మన ఆశే ఎర!
నెలకు వేలల్లో, లక్షల్లో సంపాదించే ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లను టార్గెట్ చేస్తున్న సైబర్ దొంగలు సులువుగా బురిడీ కొట్టించేందుకు బిజినెస్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్కు తెర తీశారు. ఎవరైనా గూగుల్ వంటి సెర్చ్ ఇంజిన్లలో తమకు కావల్సిన సేవల కోసం వెతికితే వెంటనే నకిలీ కస్టమర్ కేర్ సర్వీస్ నుంచి కాల్స్ చేసి మోసం చేస్తున్నారు. థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా క్రెడిట్/డెబిట్ కార్డుల సమాచారం తెలుసుకొని, వాటిని క్లోనింగ్ చేస్తూ మోసగిస్తున్న ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక మధ్య తరగతి ప్రజల ఆర్థిక అవసరాలను లక్ష్యంగా చేసుకొని, తక్కువ వడ్డీకి ఎక్కువ లోన్ ఇప్పిస్తామని మోసగిస్తున్న ఘటనలూ ఉన్నాయి. ఖాళీ సమయాల్లో మరేదైనా పని చేసుకునేందుకు ‘పార్ట్టైమ్ జాబ్’ కోసం వెతికినా.. మోసాలకు పాల్పడుతున్నారు. నకిలీ సోషల్ మీడియా ప్రొఫైల్స్ క్రియేట్ చేయడం.. అత్యవసరంగా డబ్బులు కావాలని చాట్ చేయడం, త్వరలోనే ఇస్తానని నమ్మబలకడం ఈ మధ్య సర్వసాధారణ సైబర్ నేరాలుగా మారాయి.
తెలంగాణలో టాప్-10 సైబర్ మోసాలు
1. బిజినెస్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్
2. నకిలీ కస్టమర్ కేర్ సర్వీస్ (గూగుల్ ద్వారా)
3. అమ్మాయి/అబ్బాయిలా నమ్మించడం
4. పార్ట్టైమ్ జాబ్ ఫ్రాడ్స్
5. క్రెడిట్ కార్డుల సిమ్మింగ్/క్లోనింగ్
6. లక్షల్లో లోన్ మంజూరైందని బురిడీ కొట్టించడం
7. క్రెడిట్, డెబిట్ కార్డులు పాన్కార్డుకు లింక్పేరిట మోసం
8. ఓఎల్ఎక్స్ వంటి ఈ-కామర్స్ వెబ్సైట్స్లో యాడ్స్ ద్వారా మోసం
9. లోన్లు ఇప్పిస్తామని వాయిస్, స్మిషింగ్లతో మోసాలు
10. నకిలీ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ద్వారా డబ్బులు అడగటం
కట్టుబట్టలతో బజార్లో నిలబెడతారు..
దురాశ దుఃఖానికి చేటు. ఇప్పుడు చదువుకున్నవారు, ముఖ్యంగా ఉద్యోగుస్తులు సైబర్ నేరాలపట్ల ప్రతిక్షణం అప్రమత్తంగా, తెలివితో ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. చాలామంది ఉద్యోగులకు కొత్త సైబర్ నేరాలపై అవగాహన లేకపోవడంతో డబ్బులు మోసపోయిన వారం తర్వాత పోలీస్ స్టేషన్లలోని, 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేస్తున్నారు. అప్పటికే ఆ డబ్బంతా క్రిప్టోగా మారిపోతున్నది. కాబట్టి మోసపోయామని గుర్తించిన 24 గంటలలో ఫిర్యాదు చేస్తే ఎంతోకొంత నగదు బదిలీకాకుండా చూస్తారు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు. అత్యాశకుపోయి, వారి మాయమాటలు వింటే.. కట్టుబట్టలతో మిమ్మల్ని, మీ కుటుంబాన్ని నడిబజార్ల్లో సైబర్ దొంగలు నిలబెడతారు.
– అనిల్ రాచమల్ల, సైబర్ నిపుణుడు, ‘ఎండ్ నౌ’ ఫౌండేషన్