హైదరాబాద్ : హైదరాబాద్కు సమీపంలోని సుల్తాన్పూర్లో ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన స్టెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ కంపెనీ వచ్చే ఏడాది ఏప్రిల్, మే వరకు అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ కంపెనీని ఎస్ఎంటీ నిర్మిస్తోంది. మెడికల్ డివైజెస్ రంగంలో భారతదేశానికి తెలంగాణ ఓ కేంద్రంగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని కేటీఆర్ పేర్కొన్నారు.
సుల్తాన్పూర్లోని మెడికల్ డివైజెస్ పార్కులో 7 కంపెనీలను కేటీఆర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. ఇతర దేశాల నుంచి ఇండియా 78 శాతం మెడికల్ పరికరాలను దిగుమతి చేసుకుంటుంది. గత రెండు, మూడేండ్ల కింద బయో ఏషియా సదస్సుల్లో మెడికల్ డివైజెస్ తయారీదారులతో మాట్లాడాను. భారత్లో కానీ , తెలంగాణలో కానీ మెడికల్ డివైజెస్ ఉత్పత్తికి ఏం సదుపాయాలు కావాలో అడిగి తెలుసుకున్నాను. కరోనా సమయంలో ధరించిన గ్లౌజ్లు, మాస్కులు చైనా నుంచి దిగుమతి చేసుకుంటే, ఇక్కడ తయారు చేసిన ఖర్చు కంటే కూడా తక్కువ ధరకు వస్తున్నాయని తెలిపారు. ఇది విని ఆశ్చర్యపోయాను. ప్రపంచంతో పోటీ పడాలంటే మనం ఎన్ని సవాళ్లో ఎదుర్కొవాలో వారి చెప్పిన దానిబట్టి అర్థమైందన్నారు.
అందుకే తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఒక ఆలోచనతో, ఒక వ్యూహాంతో లైఫ్ సైన్సెస్ రంగాన్ని బలోపేతం చేస్తున్నాం. ఒక వైపు హైదరాబాద్కు దక్షిణాన శ్రీశైలం రోడ్డుకు ముచ్చెర్లలో 19 వేల ఎకరాల్లో ఫార్మా సిటీ నిర్మిస్తున్నాం. ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ను ఏర్పాటు చేయబోతున్నాం. జీనోమ్ వ్యాలీని అభివృద్ధి చేస్తున్నాం. ప్రపంచంలో తయారయ్యే మూడో వంతు వ్యాక్సిన్లు తెలంగాణలోనే తయారవుతున్నాయి. హైదరాబాద్లో పారిశ్రామిక కాలుష్యం ఉండకూడదన్న ఉద్దేశంతో అలాంటి పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటకు తరలిస్తున్నాం. నాలుగేండ్ల కిందట ఈ పార్కు శంకుస్థాపనకు వచ్చినప్పుడు రాళ్లు,రప్పలతో ఉండేది. సాగుకు యోగ్యంగా లేని ఈ ప్రాంతంలో 50 కంపెనీలు వివిధ స్థాయిల్లో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఏడు కంపెనీలను ప్రారంభించుకున్నాం. మిగతా వాటిని కూడా త్వరలోనే ప్రారంభించుకుంటాం అని కేటీఆర్ స్పష్టం చేశారు.