(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): ఒకవైపు కేంద్రంలోని బీజేపీ సర్కారు స్కాలర్షిప్లు, ఫెలోషిప్లు తొలగిస్తుంటే, ఆ పార్టీ పాలిత రాష్ర్టాల్లోనూ అదే పరిస్థితి కొనసాగుతున్నది. ఫలితంగా వేల మంది విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు. తాజాగా, స్కాలర్షిప్ ఇవ్వకపోవటంతో పరీక్షలకు దూరం కావాల్సిన దుస్థితి ఏర్పడింది. యోగి సర్కారు గత ఏడాది నుంచి దళిత విద్యార్థులకు ఇచ్చే స్కాలర్షిప్లను నిలిపేసింది. దీంతో లక్నోలోని బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ దళిత విద్యార్థులు ట్యూషన్ ఫీజులు చెల్లించలేకపోయారు.
ఫీజు కట్టలేదని వర్సిటీ అధికారులు విద్యార్థులను పరీక్షలకు అనుమతించలేదు. వాస్తవానికి కుటుంబ ఆదాయం రూ.2 లక్షలకు మించని దళిత విద్యార్థులకు సంక్షేమశాఖ నుంచి ఏడాదికి రూ.80 వేలు స్కాలర్షిప్ లభిస్తుంది. కానీ, సర్కారు స్కాలర్షిప్ ఇవ్వకపోవటంతో విద్యార్థులు చదువును ఆపేసే పరిస్థితి వస్తున్నది. రాజు అనే ఇంజినీరింగ్ విద్యార్థి మీడియాతో మాట్లాడుతూ.. ‘మా నాన్న రోజువారీ కూలీ. మా కుటంబ ఆదాయం రూ.50 వేలకు మించదు. నేను స్కాలర్షిప్తోనే ఇంజినీరింగ్ చదువుతున్నా. కానీ, ప్రభుత్వం ఒక్కసారిగా స్కాలర్షిప్ నిలిపివేయటంతో చదువును ఆపేసే పరిస్థితి వస్తున్నది. గత సెమిస్టర్, ఈ సెమిస్టర్ కలిపి రూ.1.20 లక్షలు ఎక్కడి నుంచి తేవాలి’ అని నిట్టూర్చాడు. బీజేపీ ప్రభుత్వ చర్యపై విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. దళిత వర్గాలను అణచివేయాలన్న కుట్రలో భాగంగానే స్కాలర్షిప్లను నిలిపివేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.