హైదరాబాద్, ఫిబ్రవరి7 (నమస్తే తెలంగాణ): పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న షెడ్యూల్డు కులాల యువత కోసం ప్రతి జిల్లా కేంద్రంలో ఒక స్టడీ సర్కిల్ను ఏర్పాటు చేయాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ సంబంధిత ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రభుత్వ భవనాల్లో నడుస్తున్న హాస్టళ్లలో సోలార్ వాటర్ హీటర్లు, కూరగాయలు, ఆహార పదార్థాల నిల్వకు కోల్డ్ స్టోరేజ్లు, స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేయాలని, విద్యార్థులకు మరిన్ని మెరుగైన సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఎస్సీలు, మైనార్టీల సంక్షేమం, అభ్యున్నతికి ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలపై సోమవారం ఆయన మాసబ్ ట్యాంక్లోని సంక్షేమ భవన్లో సమీక్ష నిర్వహించారు. . మైనార్టీ యువతకు వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. మక్కా మసీదుతో పాటు, ఈద్గాలు, మసీదుల మరమ్మతులను త్వరగా పూర్తిచేయాలని, షాదీముబారక్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని సూచించారు. సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్, ఎస్సీ కులాల అభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి విజయ్కుమార్, కమిషనర్ యోగితారాణా, ఎస్సీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి రొనాల్డ్ రాస్, కార్పొరేషన్ ఎండీ కరుణాకర్, జీఎం ఆనంద్కుమార్, జేడీ శ్రీనివాస్రెడ్డి, మైనార్టీ వ్యవహారాల సలహాదారు ఏకే ఖాన్, ప్రభుత్వ కార్యదర్శి నదీమ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.