హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకాల మేరకు బీసీ స్టడీ సర్కిళ్లను ఎక్స్లెన్స్ సెంటర్లుగా తీర్చిదిద్దేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఉద్యోగార్థులకు మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు పలు మార్పులకు శ్రీకారం చుట్టారు. అందుకు ఆధునిక సాంకేతికత పరిజ్ఞానాన్ని, సోషల్ మీడియాను కూడా వినియోగిస్తుండటం వివేషం. తెలంగాణ ప్రభుత్వం వరుస నోటిఫికేషన్లు జారీ చేస్తున్న నేపథ్యంలో ఉద్యోగార్థులకు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు బీసీ సంక్షేమశాఖ సమగ్ర కార్యాచరణ రూపొందించింది. స్టడీ సర్కిళ్లకు సరికొత్త హంగులను కల్పిస్తున్నది. వివిధ పోటీ పరీక్షలకు సంబంధించిన పాఠ్యాంశాలను డిజిటల్ పాఠాల ద్వారా బోధించేందుకు శ్రీకారం చుట్టింది. తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ పేరిట తీసుకొచ్చిన యాప్లో నమూనా ప్రశ్నపత్రాలు, ప్రాక్టీస్ పేపర్లు, వీడియో పాఠాలు, స్టడీ మెటీరియల్ను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తున్నది. అభ్యర్థులకు మెంటరింగ్, మోటివేషనల్ కార్యక్రమాలను సైతం నిర్వహించేందుకు సన్నాహాలు చేపట్టింది. సాఫ్ట్స్కిల్స్, వ్యక్తిత్వ వికాస తరగతులను నిర్వహిస్తున్నది. ఉస్మానియా యూనివర్సిటీలోని స్టడీ సర్కిల్లో కంప్యూటర్ ల్యాబ్ను ఇటీవల ప్రారంభించింది. స్టడీ సర్కిళ్లలోని గ్రంథాలయాలను కూడా ఆధునికీకరిస్తున్నది. ఎప్పటికప్పుడు తాజా ఎడిషన్లతో కూడిన పాఠ్య పుస్తకాలను అందుబాటులో ఉంచుతున్నది.
ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 11 బీసీ స్టడీసర్కిళ్లు ఉన్నాయి. ఇటీవల మరో 50 బీసీ స్టడీ సెంటర్లను అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. త్వరలోనే గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 పరీక్షలకు సంబంధించిన శిక్షణ ఇచ్చేందుకు సన్నాహాలు చేపట్టారు. ఉద్యోగార్థులకు పోటీ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్ను కూడా ఉచితంగా ఇవ్వనున్నారు.
ఆఫ్లైన్తోపాటు ఆన్లైన్ ద్వారా ఉద్యోగార్థుల కోసం బీసీ స్టడీ సర్కిల్ పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, టెలిగ్రామ్, ఫేస్బుక్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా శిక్షణ ఇస్తున్నది. యూట్యూబ్ ద్వారా 20 వేల మందికిపైగా ఆన్లైన్ పాఠాలను పొందుతున్నారు. టెలిగ్రామ్లో ప్రత్యేకంగా స్టడీసర్కిల్ గ్రూప్ను క్రియేట్ చేయగా, రెండు రోజుల్లోనే 6,500 మంది చేరడం విశేషం. ఆయా సోషల్ మీడియా గ్రూప్ల ద్వారా ప్రతిరోజూ 100 ప్రశ్నలను ఉద్యోగార్థులకు అందిస్తున్నది. గ్రూప్స్, ఎస్ఎస్సీ, రైల్వే, బ్యాంకింగ్, యూపీఎస్పీ ఇలా అన్ని పోటీపరీక్షలకు సంబంధించి దాదాపు 300లకు పైగా వీడియోలను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ సందేహాలను గ్రూప్లో పోస్టు చేసి, నిపుణుల ద్వారా నివృత్తి చేసుకొనే వెసులుబాటు కల్పించింది.
పోటీ పరీక్షల శిక్షణ కోసం బీసీ ఉద్యోగార్థులు ఎక్కడికీ వెళ్లాల్సిన పనిలేదు. ఫీజులు కట్టాల్సిన అవసరమే లేదు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు స్టడీ సెంటర్లను ఎక్స్లెన్స్ సెంటర్లుగా తీర్చిదిద్దుతున్నాం. మంత్రి గంగుల కమలాకర్, ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం సూచనలతో పలు మార్పులు చేశాం. పేద, మధ్యతరగతికి చెందిన లక్ష మంది ఉద్యోగార్థులకు అండగా నిలిచేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. ఈ అవకాశాన్ని ఉద్యోగార్థులు సద్వినియోగం చేసుకోవాలి.
– అలోక్కుమార్, బీసీ స్టడీ సర్కిల్స్ డైరెక్టర్