హైదరాబాద్ : నిజామాబాద్ డిచ్పల్లిలోని తెలంగాణ యూరివర్సిటీలో కరోనా కలకలం సృష్టిస్తున్నది. యూనివర్సిటీలో పలువురు విద్యార్థులు జ్వరాలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో వారికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్గా తేలింది. ఇప్పటికే 17 మందికి పాజిటివ్గా నిర్ధారణ కాగా.. గురువారం మరో ముగ్గురు విద్యార్థులకు వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు మొత్తం 20 మంది విద్యార్థులు కరోనా బారినపడ్డారు. పాజిటివ్గా తేలిన విద్యార్థులను నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఐసోలేషన్లో ఉంచారు.
రెండు రోజుల కిందట పలువురు విద్యార్థులకు లక్షణాలు కనిపించాయి. దీంతో అప్రమత్తమైన వర్సిటీ వైస్ చాన్సెలర్ రవీందర్గుప్తా.. తెలంగాణ యూనివర్సిటీ అధికారులు అప్రమత్తమయ్యారు. తొలుత బాయ్స్ హాస్టల్లో విద్యార్థులు తీవ్ర జ్వరంతో బాధపడుతుండగా వారికి కరోనా పరీక్షలు చేయించగా.. కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో క్యాంపస్లోని హెల్త్ సెంటర్లో 110 మంది విద్యార్థినీ విద్యార్థులకు పరీక్షలు చేశారు. కరోనా కేసులు నమోదైన నేపథ్యంలో అధికారులు హాస్టల్తో పాటు వర్సిటీ ప్రాంగణాన్ని శానిటైజ్ చేయించారు. ఇదిలా ఉండగా.. యాదాద్రి జిల్లా రామన్నపేట వసతి గృహంలోనూ కరోనా కలకలం రేపింది. ఎస్సీ బాలుర వసతిగృహంలో ముగ్గురు విద్యార్థులకు కరోనా పాజిటివ్గా తేలింది.