హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): ఇంటర్మీడియట్ పరీక్షలు ముగింపు దశకు చేరుకోవడంతో విద్యార్థులు ముందుగానే ఎప్సెట్కు దరఖాస్తు చేయాలని అధికారుల సూచిస్తున్నారు. ఏటా ఎప్సెట్కు ఆఖరు నిమిషంలో దరఖాస్తులు పోటెత్తుతున్నాయి. దీంతో సెంటర్ల సామర్థ్యం సరిపోక బ్లాక్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తప్పని పరిస్థితుల్లో మరోచోట పరీక్ష రాయాల్సి వస్తున్నది. నిరుడు సామర్థ్యం సరిపోక 13 పట్టణాలను బ్లాక్ చేశారు. దీంతో హైదరాబాద్ లేక మరో ప్రాంతంలో సెంటర్ను కేటాయించడంతో విద్యార్థులు ఇబ్బందిపడ్డారు.
ఏపీ, తెలంగాణల్లో మొత్తం 21 టెస్ట్ జోన్లు
ఎప్సెట్ పరీక్ష కోసం ఏపీ, తెలంగాణల్లో మొత్తం 21 టెస్ట్ జోన్లను అధికారులు ఏర్పాటుచేశారు. తెలంగాణలో 16, ఏపీలో 5 టెస్ట్ జోన్లు ఉన్నాయి. ప్రత్యేకించి హైదరాబాద్లోనే నాలుగు జోన్లున్నాయి. విద్యార్థి మొదటి ప్రాధాన్యతగా ఎంపిక చేసుకున్న జోన్లోనే పరీక్షాకేంద్రాన్ని కేటాయిస్తారు. సామర్థ్యం లేకపోతే మాత్రం ఖాళీ ఉన్న మరో జోన్లో కేటాయిస్తారు. నిరుడు హయత్నగర్ను హిమాయత్సాగర్ అనుకొని ఓ విద్యార్థి హైదరాబాద్-3 జోన్ను ఎంపిక చేసుకున్నాడు.
హిమాయత్సాగర్ హైదరాబాద్-4 జోన్లో ఉండగా, పరీక్షాకేంద్రం దూరంగా హయత్నగర్లో పడింది. దీంతో సదరు విద్యార్థి ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇలాంటి విషయాల పట్ల విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని జేఎన్టీయూ అధికారులు సూచించారు. ఈ సారి తెలంగాణలో పరీక్షాకేంద్రాల సామర్థ్యాన్ని పెంచారు. ఒక్కో సెషన్కు గతంలో 27 వేల మందికి పరీక్ష నిర్వహించే అవకాశం ఉండగా, ఈ సారి ఆ సామర్థ్యాన్ని 35 వేలకు పెంచారు. ఒక్కో సెంటర్లో 10 శాతం కంప్యూటర్లకు బఫర్గా అందుబాటులో ఉంచుతారు. సాంకేతిక సమస్య తలెత్తితే వీటిల్లో నుంచి ఒక కంప్యూటర్ను విద్యార్థులకు కేటాయిస్తారు.
మందకొడిగా దరఖాస్తులు
ఎప్సెట్కు దరఖాస్తులు మందకొడిగా వస్తున్నాయి. ఆదివారం వరకు మొత్తం 73,476 మంది విద్యార్థులే దరఖాస్తు చేసుకున్నారు. ఇంజినీరింగ్కు 47,769, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి 25,627, రెండింటికి హాజరయ్యేందుకు 80 మంది చొప్పన దరఖాస్తులు సమర్పించారు. నిరుడు 3,20,683 దరఖాస్తులు వచ్చాయి. ఈ లెక్కన మరో 2.5 లక్షల మంది దరఖాస్తులు సమర్పించే అవకాశం ఉంది. ఫిబ్రవరి 26 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా, మే 6 వరకు గడువు ఉంది. ఆలస్య రుసుముతో మే 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ముగిసిన తర్వాత దరఖాస్తులు జోరందుకునే అవకాశం ఉంది.