Bhadrachalam | భద్రాచలంలో నర్సింగ్ విద్యార్థిని పగిడిపల్లి కారుణ్య అనుమానాస్పద మృతి ఉద్రిక్తతకు దారి తీసింది. విద్యార్థిని మరణానికి నిరసనగా కాలేజీ ఎదుట ఆమె కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని.. నర్సింగ్ కాలేజీని సీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. ఈ క్రమంలో కాలేజీకి వద్దకు వచ్చిన స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు.. యాజమాన్యంతో మాట్లాడారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేతో బాధిత విద్యార్థిని బంధువులు, విద్యార్థి సంఘాలు వాగ్వాదానికి దిగాయి. నిందితుల తరఫున వచ్చారా? అని నిలదీశారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో కారుణ్య బంధువులకు సర్దిచెప్పేందుకు ఎంత ప్రయత్నించినప్పటికీ వినిపించుకోలేదు. దీంతో విసుగుచెందిన ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణం కూనవరం రోడ్డులో ఉన్న ఓ ప్రైవేట్ నర్సింగ్ కళాశాలలో పగిడిపల్లి కారుణ్య (17) బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతున్నది. గురువారం తెల్లవారుజామున 3:40 గంటలకు ఓ విద్యార్థిని బాత్రూం వెళ్లేందుకు బయటకు రాగా కారుణ్య కళాశాల ఆవరణలో రక్తపు గాయాలతో పడి ఉన్న విషయాన్ని గమనించి తోటి విద్యార్థినులతో కలిసి హాస్టల్ వార్డెన్కు తెలిపింది. వెంటనే 108 వాహనంలో భద్రాచలం ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించగా, చికిత్స పొందుతూ రాత్రి 8.30 గంటలకు మృతి చెందినట్టు ఎస్సై విజయలక్ష్మి తెలిపారు.
దవాఖాన వద్ద కారుణ్య తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగగా గిరిజన, దళితసంఘాల నాయకులు మద్దతు పలికారు. భద్రాచలం ఏఎస్పీ దవాఖాన వద్దకు వచ్చి సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు. కాగా కారుణ్య శరీరంపై గాయాలు ఉండటంతో విద్యార్థిని మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హాస్టల్లో గుర్తుతెలియని వ్యక్తులు ఆమెపై దాడి చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం కాలేజీ వద్దకు చేరుకున్న మృతురాలి బంధువులు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.