భువనగిరి అర్బన్/హైదరాబాద్, ఏప్రిల్ 17: గురుకులాల్లో ఇటీవల వరుసగా జరుగుతున్న ఆత్మహత్యలు, అస్వస్థత ఘటనలు తల్లిదండ్రులను ఉలికిపాటుకు గురిచేస్తున్నాయి. భువనగిరి గురుకులంలో ఆరోతరగతి విద్యార్థి చిన్నలచ్చి ప్రశాంత్ మృతి వారిని మరింత భయాందోళనకు గురిచేసింది. రాజకీయంగానూ ఈ ఘటన తీవ్ర దుమారం రేపుతున్నది. గురుకులాలపై ప్రభుత్వ శ్రద్ధను ఈ ఘటన తేటతెల్లం చేస్తున్నదంటూ విపక్షాలు మండిపడుతుంటే, ప్రశాంత్ మృతికి బాధ్యత వహించాలంటూ అటు బాధిత తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ప్రశాంత్ మృతికి కారణమైన గురుకులాల రీజినల కోఆర్డినేటర్ను సస్పెండ్ చేయాలంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తూ బుధవారం పాఠశాల ప్రాంగణంలో ఆందోళనకు దిగారు. ఫుడ్ పాయిజన్ ఘటనను గోప్యంగా ఉంచి, అరకొర వైద్యం అందించడం వల్లే ప్రశాంత్ ప్రాణాలు కోల్పోయాడని ఆరోపించారు. బాధిత కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం ఇవ్వడంతో పాటు రూ. 20 లక్షల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. బుధవారం కూడా పాఠశాలలో ఆరుగురు విద్యార్థులకు అరకొర వైద్యం అందించడం కనిపించిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
407మందిలో 26మందికే అస్వస్థత
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 407మంది విద్యార్థులు ఉంటే వారిలో అస్వస్థతకు గురైందని 26 మందేనని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ప్రకటించింది. ఆరో తరగతి విద్యార్థి ప్రశాంత్ మృతి విచారకరమని, అతడి అంత్యక్రియలకు రూ. 20 వేలు అందించినట్టు తెలిపింది. బాధిత కుటుంబంలో ఒకరికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామని పేర్కొంటూ సొసైటీ కార్యద్శి సీతాలక్ష్మి బుధవారం సాయంత్రం ఒక ప్రకటన విడుదలచేశారు. 12న ఉదయం విరేచనాలతో అస్వస్థతకు గురైన ప్రశాంత్కు తొలుత భువనగిరి ఏరియా దవాఖానలో చికిత్స అందించామని, సాయంత్రం ఫిట్స్ వచ్చి అపస్మారక స్థితికి చేరుకోవడంతో వైద్యుల సలహా మేరకు బోడుప్పల్లోని మిరాకిల్ దవాఖానకు తరలించినట్టు ఆమె తెలిపారు. పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో మరింత నాణ్యమైన వైద్యం అందించేందుకు 13న రాత్రి జూబ్లీహిల్స్లోని రెయిన్బో చిల్డ్రన్స్ దవాఖానకు తరలించినట్టు వివరించారు. అక్కడి ఐసీయూలో చికిత్స అందించినప్పటికీ ఆరోగ్యం మెరుగుపడలేదని, 16న రాత్రి బాలుడు మృతిచెందినట్టు ప్రకటించి పోస్టుమార్టం కోసం గాంధీ దవాఖానకు తరలించారని, 17న పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించినట్టు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక రావాల్సి ఉందని పేర్కొన్నారు. బాధిత తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ఎక్స్గ్రేషియా కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్టు చెప్పారు.
ఇదే మొదటిసారి
భువనగిరి గురుకులంలో ఎన్నడూ ఇలాంటి ఘటన జరగలేదని, ఇదే మొదటిదని సీతాలక్ష్మి ఆ ప్రకటనలో పేర్కొన్నారు. గురుకులంలో వైద్యశిబిరాలు నిర్వహిస్తూ విద్యార్థుల ఆరోగ్యస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. న్యూట్రిషన్ నిపుణులు సూచించిన ప్రకారం విద్యార్థులకు భోజనాలు ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. గురకులంలో తాగునీరు, ఆహార పదార్థాల నాణ్యతను పరీక్షించేందుకు వాటి నమూనాలను ల్యాబ్కు పంపామని, నీటి నాణ్యతలో ఎలాంటి లోపమూ లేదని నివేదిక అందిందని, ఆహార పదార్థాలకు సంబంధించి నివేదిక రావాల్సి ఉందని వివరించారు. నీటి ట్యాంకులు, వంటగది, భోజనాల గది, టాయిలెట్లు, డార్మిటరీలు పూర్తిస్థాయిలో శుభ్రం చేసినట్టు చెప్పారు. ప్రాథమిక విచారణ ఆధారంగా పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీరామ్ శ్రీనివాస్ను సస్పెండ్ చేశామని, సీనియర్ లెక్చరర్ను ఇన్చార్జి ప్రిన్సిపాల్గా నియమించామని తెలిపారు. పాఠశాల క్యాటరింగ్, శానిటేషన్ కాంట్రాక్టర్లకు నోటీసులు అందించామని పేర్కొన్నారు. పాఠశాలలో 15రోజులు ఉంటూ విద్యార్థుల బాగోగులను పర్యవేక్షించాలని ఓసీడీ ఉమామహేశ్వరిని ఆదేశించామని, ఘటనపై పూర్తి విచారణకు జాయింట్ సెక్రటరీ అనంతలక్ష్మి ఆధ్వర్యంలో పెనేషియా ఓఎస్డీ ప్రశాంతి, విజిలెన్స్ ఆఫీసర్ హుస్సేన్తో కమిటీ వేసినట్టు వివరించారు. నివేదిక అందిన వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని సీతాలక్ష్మి ఆ ప్రకటనలో తెలిపారు.
ఇండ్లకు వెళ్తున్న విద్యార్థులు
ప్రశాంత్ మృతితో విద్యార్థులు, తల్లిదండ్రుల్లోనూ ఆందోళన మొదలైంది. ఫుడ్ పాయిజన్ నుంచి కోలుకున్న విద్యార్థులతోపాటు ఇతర విద్యార్థులు కూడా ఒక్కొక్కరుగా గురుకులం వీడుతున్నారు. యాజమాన్యం నిరాకరిస్తున్నప్పటికీ తల్లిదండ్రులు లేఖ రాసి గేట్ వద్దనున్న సిబ్బందికి అందించి పిల్లల్ని తీసుకెళ్తున్నారు.