హైదరాబాద్/సిటీబ్యూరో, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): ఉద్యోగాలంటే ప్రభుత్వ ఉద్యోగాలేనన్న సంస్కృతిని సమూలంగా మార్చాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కోరారు. విద్యార్థులను ఎంటర్ప్రెన్యూర్స్గా, ఉద్యోగాలు సృష్టించేవారిగా తయారుచేయాలని సూచించారు. జేఎన్టీయూ స్వర్ణోత్సవాల్లో భాగంగా శనివారం వర్సిటీలో నిర్వహించిన ఆలిండియా వీసీల ముగింపు సమావేశంలో గుత్తా మాట్లాడారు. స్వయం ఉపాధి రంగంలో విద్యార్థులను ప్రోత్సహించాలని చెప్పారు. విద్యార్థులకు జ్ఞానాన్ని, నైపుణ్యాలను సమపాళ్లలో అందించే విద్యావ్యవస్థ ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా విద్యలో ఏర్పడిన పోటీని తట్టుకొని నిలబడాలంటే సాంకేతిక విద్యలో గుణాత్మక మార్పులు రావాలని, ఇందుకు వర్సిటీలు, కళాశాలలు కరిక్యులాన్ని ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకోవాలని సూచించారు. తెలంగాణ ఐఐటీలు, టెక్నికల్ వర్సిటీల పనితీరును, మన విద్యార్థుల సామర్థ్యాలను హార్వర్డ్, మసాచుసెట్స్ యూనివర్సిటీల నిపుణులు ప్రశంసించారని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి గుర్తుచేశారు. సమావేశంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ, జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్ హుస్సేన్, రెక్టార్ ప్రొఫెసర్ గోవర్ధన్ పాల్గొన్నారు.