CM Revanth Reddy | హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): సర్కారు బడులను బలోపేతం చేయాలని, ప్రభుత్వ విద్యావ్యవస్థలను పటిష్ఠం చేసే దిశగా పౌరసమాజం మేము సైతం అంటున్నది. ప్రభుత్వ బడులను కాపాడాలని నినదిస్తున్నది. దీనిలో భాగంగా సీఎం సారూ.. సర్కారు బడులను కాపాడాలి.. అంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి లేఖలు రాస్తున్నది. ఎన్నారైల చేత ఏర్పాటైన డయల్ యువర్ విలేజ్ సంస్థ రాష్ట్రంలో పోస్టుకార్డు క్యాంపెయిన్ను చేపట్టింది. విద్యార్థులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, పౌరసమాజం ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నది. ముఖ్యంగా రాష్ట్రంలోని సర్కారు బడుల్లోని విద్యార్థులంతా ఉత్సాహంగా ఈ క్యాంపెయిన్లో భాగస్వాములు అవుతున్నారు.
పాఠశాలల్లో ఉన్న సమస్యలను సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం, కొత్త ప్రభుత్వం విద్య మీద దృష్టిని కేంద్రీకరించాలన్న లక్ష్యంతో ఈ క్యాంపెయిన్ను నిర్వహిస్తున్నట్టు డయల్ యువర్ విలేజ్ సంస్థ ప్రతినిధి సురేశ్గుప్తా తెలిపారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లోని 20 వేల మంది విద్యార్థులు ఈ క్యాంపెయిన్లో పాల్గొంటున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో 26 వేలకు పైగా పాఠశాలలు, వెయ్యికి పైగా గురుకులాలు, 475 కేజీబీవీలు ఉన్నాయి. వీటిల్లో విద్యార్థులకు సరిపడా బోధనా సిబ్బంది లేదు. ముఖ్యంగా సబ్జెక్టు టీచర్లు సరిపోను లేదు. విద్యార్థులకు అనుగుణంగా తరగతి గదులు, మూత్రశాలలు లేవు. వీటన్నింటి పరిగణనలోకి తీసుకుని, సర్కారు స్కూళ్లను బలోపేతం చేయాలనే సంకల్పంతో డయల్ యువర్ విలేజ్ సంస్థ ఈ పోస్టుకార్డు ఉద్యమాన్ని చేపట్టింది. రాష్ట్రంలో విద్యా ఎమర్జెన్సీని ప్రకటించాని, పరిష్కార మార్గాలను అన్వేషించాలని డిమాండ్ చేశారు. బడ్జెట్లో విద్యాశాఖకు నిధుల వాటా పెంచాలని కోరారు.