హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ) : పాలిటెక్నిక్ డిప్లొమా సెకండియర్ నుంచి విద్యార్థులు బీటెక్ ఫస్టియర్లో చేరవచ్చు. ఇలాంటి అద్భుతమైన అవకాశం వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలుకానున్నది. పాలిటెక్నిక్ సెకండియర్లో ఎగ్జిట్ అయి, టీఎస్ ఎంసెట్లో వచ్చిన ఆయా ర్యాంకుల ఆధారంగా బీటెక్ ఫస్టియర్లో ప్రవేశాలు పొందేలా అధికారులు నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉండగా, త్వరలోనే అవి ఆమోదానికి నోచుకోనున్నాయి. ఏఐసీటీఈ విడుదల చేసిన మల్టిపుల్ ఎగ్జిట్, ఎంట్రీ ఆప్షన్లో భాగంగా అధికారులు.. విద్యార్థులకు ఈ అవకాశాన్ని కల్పించనున్నారు. ఇప్పటివరకు పాలిటెక్నిక్ డిప్లొమా విద్యార్థులు బీటెక్లో చేరాలంటే సంబంధిత కోర్సు పూర్తి చేసి, టీఎస్ఈసెట్ ప్రవేశ పరీక్ష రాస్తేనే బీటెక్ సెకండియర్లో చేరే అవకాశం ఉండేది.
పాలిటెక్నిక్ కోర్సుల్లోని సబ్జెక్టులు అత్యంత కఠినంగా ఉంటాయి. పలువురు పాస్ కాలేక ఇబ్బందులు పడుతుంటారు. ఈ కోర్సుల్లోని విద్యార్థులు 150 క్రెడిట్లకు 130 క్రెడిట్లు సాధిస్తే పాలిటెక్నిక్ పూర్తిచేసినట్టు పరిగణిస్తున్నారు. వీటిని సాధించలేక.. చదువులు ముందుకు సాగక అనేకమంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇలా ఫెయిలై.. మిగతా కోర్సును పూర్తిచేయడం ఇష్టంలేని వారికి ఈ నిర్ణయంతో ఉపశమనం కలుగనున్నది. పాలిటెక్నిక్ సెకండియర్ తర్వాత 90 క్రెడిట్లు పొందినా లేక మూడేండ్ల కోర్సులో ఫెయిలయ్యి 90 సాధించినా ఆయా విద్యార్థికి సర్టిఫికెట్ ఇన్ ఇంజినీరింగ్ను జారీచేస్తారు. ఈ సర్టిఫికెట్తో ఎంసెట్తో ఇంజినీరింగ్లో చేరడం సహా బీఏ, బీఎస్సీ, బీకాం వంటి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు అవకాశమిస్తారు.
మూడేండ్ల డిప్లొమా కోర్సుకు 150 క్రెడిట్లను అమలు చేస్తున్నారు. వీటిలో 90 క్రెడిట్లు సాధిస్తే ఇంజినీరింగ్ సర్టిఫికెట్ జారీచేస్తారు. ఇది ఇంటర్ పాస్ సర్టిఫికెట్తో సమానం. ప్రస్తుతం ఇంటర్ విద్యార్థులు ఎంసెట్ రాసే అవకాశం కల్పిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సర్టిఫికెట్ ఇంజినీరింగ్ను పొందిన వారికి కూడా ఎంసెట్ రాసే అవకాశం లభించనున్నది.