ఎల్లారెడ్డిపేట, ఆగస్టు 8: ఎల్లారెడ్డిపేట మండలానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల(జనరల్) మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సిరిసిల్ల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వడ్లూరి శ్రీనివాస్ మంజూరు పత్రాన్ని జడ్పీటీసీ చీటి లక్ష్మణ్రావు, ఎంపీపీ పిల్లి రేణుకకు అందించారు. కాగా, గతంలో ఇచ్చిన హామీ మేరకు మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకోవడంతో మండల విద్యార్థుల కల నెరవేరింది.
దీంతో మంగళవారం విద్యార్థులు, బీఆర్ఎస్ నాయకులు మండల కేంద్రంలో సంబురాలు జరుపుకున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో విద్యార్థులు మంత్రి కేటీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు బండారి బాల్రెడ్డి ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట పాత బస్టాండులో పటాకులు కాల్చి సంబురాలు జరుపుకున్నారు.