హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ)/ఖైరతాబాద్: యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లును తక్షణమే ఆమోదించాలని డిమాండ్ చేస్తూ భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం (బీఆర్ఎస్వీ) ప్రత్యక్ష ఆందోళనకు దిగింది. గవర్నర్ వైఖరిని నిరసిస్తూ మంగళవారం రాజ్భవన్ను ముట్టడించింది. బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ నేతృత్వంలోని బీఆర్ఎస్వీ, ఇతర విద్యార్థి సంఘాల నాయకులు రాజ్భవన్ ముందు ఆందోళనకు దిగారు. గవర్నర్ డౌన్, డౌన్ అంటూ నినాదాలు చేశారు. ప్లకార్డులు చేతబట్టి, పెద్దఎత్తున నినాదాలు చేశారు.
పోలీసులు విద్యార్థి సంఘాల నేతలను అరెస్ట్చేసి పోలీస్స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ.. గవర్నర్ వెంటనే కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు. ఐదు నెలల క్రితం బిల్లును ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించి పంపిస్తే ఇప్పటివరకు ఆమోదించకుండా రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి సహా ఇతర అధికారులు గవర్నర్ను కలిసి సందేహాలు నివృత్తి చేసినా బిల్లును తొక్కిపెట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ధ్వజమెత్తారు.
గవర్నర్ రాష్ట్ర బీజేపీ నాయకుల కనుసన్నల్లో పనిచేస్తూ.. బండి సంజయ్, కిషన్రెడ్డి చెప్పినట్టు నడుచుకుంటున్నారని తీవ్రస్థాయిలో ఆరోపించారు. బిల్లు పెండింగ్లో పెట్టడంతో రాష్ట్రంలో 3 వేల పోస్టులు భర్తీకాకుండా పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్నారు. బిల్లును ఆమోదించే వరకు నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తామని స్పష్టంచేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. నకిరేకల్లో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో కేంద్రం దిష్టిబొమ్మను దహనం చేశారు.
గవర్నర్ మొండి వైఖరి వీడాలి
గవర్నర్ మొండి వైఖరి వీడి.. కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లు, ములుగు ఫారెస్ట్ కాలేజీని యూనివర్సిటీగా మార్చే బిల్లు, వ్యవసాయ విశ్వవిద్యాలయ చట్ట సవరణ బిల్లులను ఆమోదించాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ తుంగ బాలు మంగళవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.