డోర్నకల్, డిసెంబర్ 16: ఇప్పటికైనా ప్రభుత్వం సరైన సమయంలో నోటిఫికేషన్ ఇవ్వాలని పేర్కొంటూ సూసైడ్ లెటర్ రాసి ఓ నిరుద్యోగి బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. గతంలో చాలా ఉద్యోగాలకు అప్లయ్ చేశానని, ఉద్యోగాలు పెండింగ్ పడటంతో కోచింగ్ సెంటర్లలో డబ్బులు కట్టలేక ఊరికి వచ్చానని.. ఉద్యోగం లేక ఊళ్లో ప్రజలకు ముఖం చూపించలేకపోయానని లేఖలో పేర్కొన్నాడు.
ఈ విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రమట్టితండాలో శుక్రవారం రాత్రి కలకలంరేపింది. డోర్నకల్ హెడ్కానిస్టేబుల్ కోటేశ్వరావు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన భూక్య వినయ్ (23) గ్రాడ్యుయేషన్ వరకు చదివాడు. వరంగల్, హైదరాబాద్లోని పలు కోచింగ్ సెంటర్లలో ఉద్యోగాల కోసం కోచింగ్ తీసుకున్నాడు. 2021-23 మధ్య రైల్వే కానిస్టేబుల్, గ్రూప్-4, కానిస్టేబుల్ పరీక్షలు రాశాడు.
ఈ మధ్యనే స్వగ్రామానికి వచ్చిన వినయ్, శుక్రవారం రాత్రి తండాలోనే తన మామయ్య పాపిలాల్ ఇంటి వద్ద నిద్రించాడు. ఉద్యోగం రావడం లేదన్న ఆలోచనలతోనే మదనపడుతూ అర్ధరాత్రి తర్వాత పాపిలాల్కు చెందిన వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వేకువజాము నుంచే కుటుంబసభ్యులు ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు. బావిలోకి చూడగా వినయ్ మృతదేహం కనిపించింది.
స్థానికుల సమాచారంతో గ్రామానికి వచ్చిన పోలీసులు, బావిలోంచి మృతదేహాన్ని వెలికితీశారు. వినయ్ తండ్రి 20 ఏండ్ల క్రితమే ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తల్లి కల్పన కూలి పనులు చేసుకుంటూ ఇద్దరు పిల్లలను చదివించింది. ఉద్యోగం రాలేదని మనస్తాపంతోనే తన కొడుకు చనిపోయాడని కల్పన పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, సాయంత్రం వినయ్ రాసిన సూసైడ్ లెటర్ ఇంట్లో లభ్యం కావడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది.