హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): దేశంలో రెన్యూవబుల్ ఎనర్జీ (సౌర, పవన విద్యుత్తుతోపాటు బయోగ్యాస్, చెత్త నుంచి తయారయ్యే విద్యుత్తు) ఎక్కువగా దక్షిణాది రాష్ర్టాల్లోనే ఉత్పత్తి అవుతున్నది. ఉత్తరాదిలో రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ లాంటి పెద్ద రాష్ర్టాలున్నప్పటికీ దక్షిణాదిలోని 5 రాష్ర్టాలైన తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ భాగస్వామ్యం ఎక్కువగా ఉన్నట్టు తాజా నివేదిక వెల్లడించింది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) ఆధ్వర్యంలోని రెన్యూవబుల్ ప్రాజెక్ట్ మానిటరింగ్ విభాగం విడుదల చేసిన ఈ నెలవారీ నివేదికలో 2023 ఏప్రిల్, మే నెలలతోపాటు 2022 ఏప్రిల్, మే నెలల్లో వివిధ ప్రాంతాలవారీగా ఉత్పత్తయిన రెన్యూవబుల్ ఎనర్జీ వివరాలను పొందుపర్చారు.