హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో వైద్యులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు కఠిన చట్టాలు తేవాలని వైద్య సంఘాలు డిమాండ్ చేశాయి. గాంధీ హాస్పిటల్లో వైద్యుడిపై సోమవారం జరిగిన దాడిని తెలంగాణ జూనియర్ డాక్టర్ల సంఘం, తెలంగాణ సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల అసోసియేషన్, హెల్త్ కేర్ రిఫార్మ్స్ డాక్టర్ల అసోసియేషన్, తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్, టీజీవో డాక్టర్ల ఫోరమ్ వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశాయి. గాంధీ హాస్పిటల్లో విధులు నిర్వహిస్తున్న జూనియర్ డాక్టర్పై రోగి సహాయకులు దాడి చేయడం హేయమైన చర్యగా అభివర్ణించాయి. వైద్యులు అనేక ఒత్తిళ్లను ఎదుర్కొంటూ రోగుల ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నిస్తారని, ఏ వైద్యుడూ పేషెంట్ను ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేయబోరని పేర్కొన్నాయి. నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సీసీ టీవీ నిఘాను మరింత పెంచాలని ప్రభుత్వాన్ని కోరాయి.