హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): గురుకుల, ఆశ్రమ పాఠశాలల్లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు చేరడం ప్రభుత్వం విద్యావ్యవస్థకు ఇస్తున్న ప్రాధాన్యానికి నిదర్శనమని స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
సోమవారం హైదరాబాద్ మాసబ్ట్యాంక్లోని సంక్షేమభవన్లో గిరిజన సంక్షేమశాఖ ఉన్నతాధికారులు, ఐటీడీఏ పీవోలు, ఆర్సీవోలతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని విద్యార్థులకు సీజనల్ వ్యాధులతో పాటు గిరిజన గురుకులాల్లో పలు సమస్యలను మంత్రి తీవ్రంగా పరిగణించారు. ఇకపై నిరంతరం గురుకుల విద్యాలయాల్లో అధికారుల పర్యవేక్షణ కొనసాగుతుందని చెప్పారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు.